నేరాల్లో - బూటకపు ఎన్ కౌంటర్లలో నెంబర్ 1 : మా వైపు తప్పు చూపిస్తారా - బీజేపీపై అఖిలేష్ ఫైర్..!!
ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు మాటల తీవ్రతను పెంచుతున్నాయి. తొలి దశ పోలింగ్ ముగియటంతో...రాజకీయ పార్టీలు మలి విడత పోలింగ్ పైన ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగా ప్రచారాన్ని హోరా హోరీగా కొనసాగిస్తున్నాయి. ఇక, బీజేపీ - ఎస్పీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తొలి విడత పోలింగ్ ముగిసిన తరువాత బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
తొలి విడత ఎన్నికలు జరిగిన 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని కమల నాధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇదే సమయంలో ఎస్పీ అధినేత అఖిలేష్ బీజేపీ పైన ఫైర్ అయ్యారు. తమ పార్టీ పైన చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టారు. బీజేపీ పాలనలో యూపీలో నేరాల సంఖ్య పైన తీవ్ర విమర్శలు చేసారు.
నేరాల్లో యూపీ నెంబర్ 1 స్థానంలో
మహిళలపై జరిగే నేరాల్లో యూపీ నంబర్ 1 స్థానంలో ఉంది..కస్టడీ మరణాల్లో నంబర్ 1 అని.. జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి అందిన నోటీసుల్లో నంబర్ 1 గా ఉందని.. బూటకపు ఎన్ కౌంటర్లలో నంబర్ 1 అని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. బీజేపీ తన క్రైమ్ రికార్డ్ కోసం ఎస్పీపై దాడులను కొనసాగిస్తున్న నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు వచ్చాయని గుర్తు చేసారు.
బీజేపీ అబద్దాల ప్రచారంతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాను ముందుకు తీసుకురావాలని సూచించారు. తమ పార్టీ పైన నేరాల గురించి బీజేపీ నేతలు చేసే ఆరోపణలు అర్దరహితమని కొట్టి పారేసారు. తమ పాలనలో జరగుతున్న పరిణామాలను బీజేపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హత్రాస్లో ఏం జరిగిందో ఎలా మరచిపోగలరని ప్రశ్నించారు.
బీజేపీ ప్రభుత్వంపై అఖిలేష్ ఫైర్
పోలీసులు మరియు ప్రభుత్వం చేసిందని ప్రశ్నించారు. లఖింపూర్లో ఏం జరిగిందని నిలదీసారు. లక్నోలో ఆపిల్ ఉద్యోగి ఏమయ్యాడని అడిగారు. గోరఖ్పూర్లో ఒక వ్యాపారవేత్తను కొట్టి చంపారని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇవన్నీ గుర్తున్నాయని అఖిలేష్ పేర్కొన్నారు. తొలి దశ పోలింగ్ విధానం..ప్రజలు ఓటు వేయడానికి బయటకు వస్తున్న తీరు పరిశీలిస్తే.. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేది స్పష్టం అవుతుందన్నారు.
రెండవ మరియు మూడవ దశ కూడా అదే విధంగా చూస్తుందని అఖిలేష్ ధీమా వ్యక్తం చేసారు. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం తొలి విడత పోలింగ్ తమకు అనుకూలంగా ఉందంటూ ధీమా వ్యక్తం చేసారు. మొదటి రౌండ్ పోలింగ్ తర్వాత అఖిలేష్ యాదవ్ నిద్ర పోయాడని ఎద్దేవా చేసారు.
తొలి దశపై అమిత్ షా ధీమా
ఉత్తరప్రదేశ్లోని 403 సీట్లలో 300 సీట్లకు పైగా బిజెపి కైవసం చేసుకుంటోందంటూ ధీమా వ్యక్తం చేసారు. మార్చి 7 వరకు ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుందని, మార్చి 10న ఫలితాలు వెలువడుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. అఖిలేష్ వ్యాఖ్యల పైన స్పందిస్తూ.. ఉత్తరప్రదేశ్లో ఏం చేశారని అఖిలేష్ యాదవ్ అడుగుతున్నారని.. బీజేపీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించిందని షా చెప్పారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడిందని తామే అని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం నేరాల సంఖ్యను తగ్గించటంతో పాటుగా ..గూండాలు ..మాఫియా పాలనను రాష్ట్రం నుంచి పంపేసామని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇంకా..ఆరు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉండటంతో...రానున్న రోజుల్లో ఈ రకమైన ఆరోపణలు.. కౌంటర్లు మరింత తీవ్ర స్థాయిలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది.