షాకింగ్:అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను వేశ్యగా చిత్రీకరించి..ఆన్లైన్లో ఫొటోలు, ఫోన్ నంబర్.
మన జీవితాల్లో సోషల్ మీడియా భాగం అవుతున్నకొద్దీ.. దాన్నే అడ్డంపెట్టుకుని దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. ఆన్ లైన్ వేదికగా గడిచిన ఐదేళ్లలో ఆర్థిక నేరాలతోపాటు మహిళలకు బెదిరింపులు, అత్యాచార హెచ్చరికలూ గణనీయంగా పెరిగిపోయాయి. గుర్తుతెలియని వ్యక్తులే కాకుండా దోస్తులు, సొంత కుటుంబీకులు సైతం అకృత్యాలకు పాల్పడుతుండం తరచూ చూస్తున్నాం. బాగా చదువుకుని ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నవాళ్లుసైతం నీచానికి దిగుతున్న సందర్భాలున్నాయి. భార్య మాటవినడంలేదన్న కోపంతో ఆమె ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేసి, అసభ్య పోస్టింగ్స్ పెట్టిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉదంతం మార్చిలో చర్చనీయాంశమైంది. తాజాగా మరో ఘటనలో వరకట్నం కోసం కట్టుకున్న భార్యనే వేశ్యగా చిత్రీకరించాడో ప్రబుద్ధుడు.

బైక్ కొనివ్వలేదని..
వరకట్నం దురాచారానికి మరో ఆడబిడ్డ బతుకు బజారునపడింది. ఉత్తరప్రదేశ్ లోని అజాంగఢ్ జిల్లా తుతియా గ్రామానికి చెందిన 26ఏళ్ల పునీత్ కు ఏడాది కిందట పెళ్లైంది. ముహుర్తానికి ముందే అనుకున్న కట్నకానుకలు అందుకున్నా, అదనపు కట్నంగా పుట్టింటివారి చేత బైక్ కొనిపించాలంటూ అతను భార్యపై ఒత్తిడి పెంచాడు. ఉన్నదంతా పెళ్లి చేయడానికే ఖర్చయిపోగా, బైక్ కొనిపెట్టలేమని అత్తమామలు తేల్చిచెప్పడంతో పునీత్ భార్యను ప్రతిరోజూ హింసించడం మొదలుపెట్టాడు.

తట్టుకోలేక వెళ్లిపోయిన భార్య..
పునీత్ హింసను భరించలేని స్థితికి చేరుకున్న భార్య.. తిరుగుబాటు చేసింది. బైక్ కొనిచ్చే సమస్యేలేదని గట్టిగా చెప్పేసి, గత నెలలో పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతనిలోని ఉన్మాది ఇంకాస్త రెచ్చిపోయాడు. పుట్టిట్లో ఉంటోన్న పునీత్ భార్యకు గత కొద్ది రోజులుగా విపరీతంగా ఫోన్ కాల్స్ వచ్చేవి. ఆన్ లైన్ లో ఫొటో చూశామని, రేటు ఎంతైనా చెల్లిస్తామంటూ అవతలి వ్యక్తులు నీచంగా మాట్లాడుతుండటంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం అజాంగఢ్ ఎస్పీ దాకా చేరడంతో దర్యాప్తు వేగంగా సాగింది.

పునీత్ పన్నాగమే..
తన ఫోన్ కు అసభ్య కాల్స్ వ్యవహారంలో భర్తపైనా అనుమానం ఉన్నట్లు బాధితురాలు చెప్పడంతో పోలీసులు పునీత్ ను అదుపులోకి తీసకుని తమదైన శైలిలో విచారించగా, అసలు నిజాలు బయటపడ్డాయి. అత్తగారు బైక్ కొనివ్వడంలేదన్న కోపంతో తానే భార్య ఫొటోలు, ఫోన్ నంబర్ ఆన్ లైన్ లో పోస్ట్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అంతేకాదు, పరిచయం లేని వ్యక్తుల దగ్గరికెళ్లి.. ‘ఓ మహిళతో మాట్లాడిస్తాను, నంబర్ కూడా ఇస్తా'నంటూ పునీత్ డబ్బులు తీసుకునేవాడని విచారణలో తేలింది.
Recommended Video

ఇంత నీచుణ్ని చూడలేదు..
నేరం అంగీకరించంతో పునీత్ ను కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్ కు తరలించామని అజాంగఢ్ ఎస్పీ కార్యాలయం పీఆర్వో సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. తన సర్వీసులో ఇలాంటి నీచుణ్ని ఎప్పుడూ చేడలేదని, అరుదైన కేసు కాబట్టే దీన్ని స్వయంగా ఎస్పీనే పర్యవేక్షించారని పేర్కొన్నారు. పునీత్ కు కఠిన శిక్ష పడేలా బలమైన చట్టాలతో కేసు ఫైల్ చేశామని, ఆధారాలను కూడా పక్కాగా సేకరించామని సింగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications