UP polls: ఎస్పీ కంచుకోట నుంచి పోటీ చేయనున్న అఖిలేష్ యాదవ్
లక్నో: నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనని చెప్పిన సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గం తేలిపోయింది. అఖిలేష్ యాదవ్ మొయిన్పురిలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ ప్రకటన చేసింది.
కాగా, మొయిన్పురి జిల్లాలోని కర్హాల్లో సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ కుటుంబానికి ముందు నుంచి మంచి పట్టు ఉంది. 1993 నుంచి ఈ స్థానం నుంచి ఈ స్థానంలో ఎస్పీ అభ్యర్థులే విజయం సాధిస్తుండటం గమనార్హం. ఒక్క 2022-07లో మాత్రం బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో సోబరన్ సింగ్ యాదవ్ ఈ స్థానం నుంచి లక్షకుపైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ స్థానంలో బీజేపీ నుంచి పోటీచేసిన రమా శక్యాకు 65వేల ఓట్లు వచ్చాయి.
ఇక మొయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి అఖిలేష్ తండ్రి, సమాజ్వాదీ వ్యవస్థాపకుడు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఈ స్థానం నుంచైతే గెలుపు ఖాయమని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ.. శాసనమండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు అఖిలేష్ యాదవ్. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో అఖిలేష్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ ఆజంగఢ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్పూర్ సదర్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
బీజేపీలో చేరిన అఖిలేష్ బంధువులు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ప్రధాన పార్టీల్లో వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం సమాజ్ వాదీ పార్టీకి గట్టి షాకిస్తూ ఆ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, ములాయం తోడల్లుడు, ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా కమలం పార్టీలోకి చేరారు.
గురువారం బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ప్రమోద్ గుప్తా కాషాయ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రమోద్ గుప్తా మాట్లాడుతూ.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాఫియా, నేరస్థులను ఎస్పీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీ వ్యవస్థాపకుడైన నేతాజీ ములాయం సింగ్ యాదవ్ పార్టీలో ఖైదీగా మారిపోయారన్నారు. ఆయన, శివపాల్ యాదవ్ పట్ల అఖిలేష్ దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక అలాంటి పార్టీలో ఉండటం అనవసరం అనిపించిందని, అందుకే బీజేపీలో చేరినట్లు గుప్తా తెలిపారు. కాగా, ములాయం సింగ్ సతీమణి సాధనా గుప్తా సోదరి భర్తే ప్రమోద్ గుప్తా. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.