ఆడపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వొద్దు-అత్యాచారాలకు అవే కారణం-వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని... వాటివల్లే అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఆడపిల్లల తల్లిదండ్రులు వారికి మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. అలీగఢ్ కోర్టులో మహిళలకు సంబంధించిన పలు ఫిర్యాదులపై విచారణ సందర్భంగా మీనా కుమారి ఈ వ్యాఖ్యలు చేశారు.
'మగవాళ్లతో స్నేహాలు,ఆపై పారిపోవడాలు...'
తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లులు తమ కూతుళ్లను కనిపెట్టుకుని ఉండాలని మీనా కుమారి అన్నారు. వారి అజాగ్రత్త కారణంగా నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ కూతుళ్లు అజాగ్రత్తగా ఉన్నారంటే... దానికి తల్లులే కారణమన్నారు. అంతేకాదు,గ్రామీణ ప్రాంతాల్లోని ఆడపిల్లలకు మొబైల్ ఫోన్లు సక్రమంగా వినియోగించడం తెలియదన్నారు.
అబ్బాయిలతో స్నేహం చేసేందుకు... వారితో గంటల కొద్ది మాట్లాడేందుకే వారు మొబైల్ ఫోన్లు వినియోగిస్తారని... ఆ తర్వాత వారితో కలిసి పారిపోతారని అన్నారు. స్మార్ట్ ఫోన్లలో చెడు కంటెంట్ను చూసేందుకే వాటిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కూడా వారి ఫోన్లను చెక్ చేయరని... వాళ్లేం చేస్తున్నారో గమనించరని అన్నారు.
మొబైల్ ఫోన్లకు అత్యాచారాలకు లింకేంటి?
ఉత్తరప్రదేశ్లో మహిళలపై వరుస నేరాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆడవాళ్లనే తప్పు పట్టేలా మీనా కుమారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహిళలపై అత్యాచారాలకు,మొబైల్ ఫోన్ వాడకానికి లింక్ ఏంటని మీనా కుమారిని ప్రశ్నించగా...'ప్రతీ రోజూ నాకు ఐదారు కేసులు,కనీసం 20 మంది మహిళల గురించి ఇటువంటి ఫిర్యాదులే వస్తాయి. అందులో ఫోన్లో స్నేహాలు,ప్రేమ వ్యవహారాలే ఉంటాయి. కొన్ని కేసుల్లోనైతే ఆడపిల్లలను ఆకర్షించి వారిపై లైంగిక దాడులకు పాల్పడే ఘటనలు కూడా ఉంటాయి.' అని చెప్పుకొచ్చారు.
తప్పు పట్టిన మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలు...
మరోవైపు మీనా కుమారి వ్యాఖ్యలను యూపీ మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలు అంజు చౌదరి తప్పు పట్టారు. మహిళలపై లైంగిక దాడులు అరికట్టేందుకు... వారు మొబైల్ ఫోన్లు వాడకూడదని చెప్పడం సరికాదన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇలాంటివి పరిష్కారం కాదన్నారు. ఆడపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని చెప్పే బదులు... పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేయకూడదని వారికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో ఇదే యూపీలోని బదౌన్లో ఓ వివాహితపై పూజారి అతని శిశ్యులు గ్యాంగ్ రేప్కి పాల్పడినప్పుడు చంద్రముఖి దేవి అనే మహిళా కమిషన్ సభ్యురాలు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం సమయంలో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉంటే ఆమెపై అఘాయిత్యం జరిగేది కాదన్నారు. అప్పట్లో ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది.