ఉపహార్ సినిమా దుర్ఘటన కేసు: క్యూరేటివ్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం, అన్సాల్ సోదరులకు ఊరట
ఢిల్లీ: 1997 ఢిల్లీలోని ఉపహార్ సినిమా హాలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 59 మంది మృతి చెందారు. ఇక అప్పటి నుంచి తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఉపహార్ ఘటన బాధితుల సంఘం వేసిన క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఉపహార్ సినిమా థియేటర్ యజమానులైన సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్ సోదరులకు భారీ ఊరట లభించినట్లయ్యింది.
1997 జూన్ 13న దుర్ఘటన
1997 జూన్ 13వ తేదీన ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్లో హిందీ చిత్రం బోర్డర్ చిత్ర ప్రదర్శన జరుగుతుండగా షాట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో చిత్రం చూస్తున్న 59 మంది ప్రేక్షకులు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. ఇక అప్పటి నుంచి బాధితులు తమకు న్యాయం చేయాల్సిందిగా తిరగని కోర్టు అంటూ లేదు. మృతుల కుటుంబ సభ్యులు ఒక సంఘంగా ఏర్పడి న్యాయపోరాటంకు దిగారు. అప్పటికే అన్సార్ సోదరులు జైలులో శిక్ష పొందుతున్నారు.
2017లో కోర్టు ఏం చెప్పిందంటే..
2017లో ఉపహార్ సినిమా యజమానుల్లో ఒకరైన సుశీల్ అన్సాల్ వయస్సును దృష్టిలో ఉంచుకుని అతను ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటుండటంతో జైలు శిక్షను తగ్గించింది న్యాయస్థానం. అయితే మరో సోదరుడు గోపాల్ అన్సాల్ విషయంలో మాత్రం కోర్టు రిలీఫ్ ఇవ్వలేదు. మిగిలిన ఒక్క సంవత్సరం కూడా శిక్ష పూర్తి చేయాల్సిందేనంటూ ఆదేశించింది.
Recommended Video
క్యూరేటివ్ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉపహార్ సినిమా ట్రాజెడీ కేసులో ఇద్దరి నిందితులకు ఒక సంవత్సరం కఠిన కారాగారా శిక్షను రెండేళ్లకు మార్చిందని పొరపాటున మరో ఏడాది అదనపు శిక్షకు బదులుగా ఒక్కొక్కరిపై రూ.30 కోట్లు భారీ జరిమానా విధించిందని క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లు చెప్పారు. అంతేకాదు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్ అన్సాల్కు జైలు శిక్ష తగ్గించడం తమకు ఆమోదయోగ్యం కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ క్యూరేటివ్ పిటిషన్ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో విచారణ చేసిన త్రిసభ్య ధర్మాసనం క్యూరేటివ్ పిటిషన్ను కొట్టివేసింది.