రాజ్యసభలో తీవ్ర గందరగోళం: నిరసనలతో లోకసభ వాయిదా
పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బుధవారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభను శుక్రవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఒకరోజు విరామం తర్వాత సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు విపక్షాలు ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటూ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేస్తున్నారు. విపక్షాలు నిరసనలు తీవ్రతరం కావడంతో స్పీకర్ సభను 12గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ ప్రారంభమైనప్పటికీ విపక్షాలు తమ ఆందోళనలను కొనసాగించారు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్.
రాజ్యసభలో తీవ్ర గందరగోళం
రాజ్యసభ సమావేశాల్లోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ఎంపీలను అరెస్ట్ చేయడంపై తృణమూల్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. డిప్యూటీ ఛైర్మన్ కలగజేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.