కరోనా సెకండ్వేవ్ రకం కొత్త లక్షణాలివే- భయానకంగా- వ్యాక్సిన్ల తయారీలో మార్పులు
దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్గా పేర్కొంటున్న ఈ రెండో విడతలో గతంలో కంటే అత్యంత వేగంగా వైరస్ వ్యాపిస్తోంది. లక్షణాలు కూడా విభిన్నంగా ఉంటున్నాయి. దీంతో జనంతో పాటు ప్రభుత్వాల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. ఓవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతున్నా ఈ వైరస్ను అది కట్టడి చేస్తోందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కరోనా వైరస్ సెకండ్ వేవ్ లక్షణాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, యూపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ సెకండ్ వేవ్ కారణంగా భారీ ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పరిస్ధితి మరింత విషమిస్తే లాక్డౌన్ విధించవచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. దీంతో ఈ సెకండ్ వేవ్పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ వేగం పెంచడంతో పాటు ఆంక్షల్ని కూడా కఠిన తరం చేస్తున్నాయి. అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ లక్షణాలపై కూడా అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ లక్షణాలివే..
కరోనా సెకండ్ వేవ్లో భాగంగా వ్యాపిస్తున్న కొత్త వైరస్ మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాల వెంట ఉన్న రోగ నిరోధక రక్షణ నుంచి త్వరగా తప్పించుకోగలదని అధ్యయనాలు చెప్తున్నాయి. గతంలో కరోనా వైరస్ సోకినప్పుడు జ్వరాన్ని ప్రధాన లక్షణంగా గుర్తించే వారు. కానీ ఇప్పుడు వినికిడి లోపం, కండరాల నొప్పి, చర్మ వ్యాధులు, కండ్ల కలక, కడుపులో నొప్పి, ఇతరత్రా ఇబ్బందులు సెకండ్వేవ్లో కనిపిస్తున్నాయి. వీటితో పాటు పొడి, నిరంతర దగ్గు, వాసన, రుచి కోల్పోవడం, వేళ్లు, కాలి రంగులు పాలిపోవడం వంటి లక్షణాలు బయటపడ్డాయి.
గత వైరస్ కంటే పూర్తి భిన్నంగా
ప్రస్తుతం యూకే రకం లేదా కెంట్ రకం వైరస్ ఇతర రకాల కంటే ఎక్కువ సులభంగా, వేగంగా వ్యాపిస్తోంది. కెంట్ రకం వైరస్ గతంలో బయటపడిన ఇతర రకాల కంటే 70 శాతం ఎక్కువ ప్రాణాంతకమని యూకే శాస్త్రవేత్తల సలహా బృందం వెల్లడించింది. దీని లక్షణాలు గతంలో బయటపడిన వైరస్ కంటే పూర్తి భిన్నంగా ఉన్నట్లు వారు గుర్తించారు. ఇందులో నిరంతర దగ్గు, అలసట, కండరాల నొప్పులు, గొంతు నొప్పి, జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
వ్యాక్సిన్ల తయారీలోనూ మార్పులు
ప్రస్తుతం భారత్లో ఎక్కువగా కనిపిస్తున్న కెంట్ రకం కరోనా వైరస్ దక్షిణాఫ్రికా జాతి వైరస్ను పోలి ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇది ప్రస్తుతం మనం వాడుతున్న టీకాలను ఎదుర్కొనే సత్తా కలిగి ఉంది. దీంతో వ్యాక్సిన్ల తయారీ సంస్దలు సైతం ఇప్పటికే తయారు చేస్తున్న వ్యాక్సిన్లను సవరిస్తున్నట్లు తెలుస్తోంది. మెరుగైన రక్షణ కోసం బూస్టర్లను వీటిని అనుసంధానిస్తున్నారు. సిద్ధాంతపరంగా టీకాల రసాయన కూర్పును అవసరాలకు అనుగుణంగా మార్చడం చాలా తేలికైన పని అనిపించినప్పటికీ, అసలు అణు నిర్మాణంలో 4-5 కంటే ఎక్కువ మార్పులు చేయడానికి నెలలు పట్టవచ్చని తెలుస్తోంది.