క్రిమినల్ మంత్రుల అనర్హతకి సుప్రీం నో, ప్రధానికి హితవు
న్యూఢిల్లీ: అవినీతి, నేరాభియోగాలు ఉన్న మంత్రుల పైన అనర్హత వేటుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే, నేరచరిత ఉన్న వాళ్లను మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించడం సబబు కాదని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు నేర చరిత కలిగిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
క్రిమినల్ కేసులున్న మంత్రులను అనర్హులుగా ప్రకటించాలంటూ ఇటీవల ఓ పిటిషన్ దాఖలైంది. అనర్హత వేటు వేసేందుకు కోర్టు నిరాకరించింది. ఈ అంశంపై నిర్ణయాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల వివేకానికే వదిలిపెడుతున్నట్లు ఐదుగురు జడ్జిల నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
అయితే, ప్రధాని, సీఎంలకు హితవు పలికింది. విచారణ ఎదుర్కొంటున్న వారిని మంత్రివర్గంలో చేర్చుకోవద్దని సూచించింది. అలాంటి వారిని మంత్రులుగా విధుల నిర్వహణకు అనుమతించరాదని పేర్కొంది. అవినీతి, నేరాభియోగాలు ఉన్నవారు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించడం సరికాదని, ప్రధాని, సీఎంలపై రాజ్యాంగపరంగా గురుతర బాధ్యతులున్నాయని పేర్కొంది.