2020లో దేశంలో పట్టణ నిరుద్యోగిత రేటు... లేబర్ ఫోర్స్ సర్వేలో ఆసక్తికర విషయాలు...
దేశంలో పట్టణ నిరుద్యోగిత రేటుకు సంబంధించి కేంద్ర గణాంకాల శాఖ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎఫ్ఎల్ఎస్)ను విడుదల చేసింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం 2020 జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 9.1శాతానికి పెరిగింది. అంతకుముందు త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2019)లో ఇది 7.9శాతంగా ఉంది. ఈ లెక్కన గతేడాది మొదటి త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు గత త్రైమాసికం కంటే 1.2శాతం పెరిగింది. అదే 2019 జనవరి మొదటి త్రైమాసికంతో పోల్చితే ఈ వ్యత్యాసం కేవలం 0.2 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
ఆ ఏజ్ గ్రూప్లో నిరుద్యోగిత రేటు...
2020 గణాంకాల ప్రకారం జనవరి-మార్చి త్రైమాసికంలో పట్టణ ప్రాంత నిరుద్యోగుల్లో 15-29 వయసు గ్రూప్ వారు 21.1శాతం మంది ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అంతకుముందు ఏడాది అక్టోబర్-డిసెంబర్లో ఇది 19.2శాతంగా ఉంది. 2019లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో 8.9శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 8.4శాతానికి తగ్గినట్లు తేలింది. అంతకుముందు ఏడాది 2018లో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇది 9.9శాతంగా ఉంది.
మహిళలు,పురుషుల్లో నిరుద్యోగిత రేటు...
మహిళా నిరుద్యోగిత రేటు 2020 జనవరి-మార్చి త్రైమాసికంలో 10.5శాతం ఉండగా.. అంతకుముందు ఏడాది ఇది 9.8శాతంగా ఉంది. 2020లో పురుషుల నిరుద్యోగిత రేటు విషయానికొస్తే... జనవరి-మార్చి త్రైమాసికంలో 8.7శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో పురుషుల నిరుద్యోగిత రేటు 7.3శాతంగా ఉంది. అంటే ఏడాది వ్యవధిలో 1.4శాతం పెరిగింది. ప్రస్తుత వీక్లీ స్టేటస్ ఆధారంగా మాత్రమే ఈ డేటాను రూపొందించారు. కాబట్టి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ వార్షిక సర్వే గణాంకాలతో పోల్చితే ఇందులో తేడా ఉంటుంది.
సర్వే జరిగిందిలా...
ఈ సర్వే కోసం గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దాదాపు 43,971 కుటుంబాలు 1.73లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. అంతకుముందు 2019 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు 45,555 కుటుంబాలు 1.79లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి అప్పటి నిరుద్యోగిత రేటు డేటాను రూపొందించారు.
కాగా,గతేడాది కరోనా రూపంలో అనుకోని విపత్తు ఎదురవడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగ,ఉపాధి కోల్పోయారు. చిన్న చిన్న వ్యాపారులు కోలుకోలేని దెబ్బతిన్నారు. చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద వారికి ఆర్థిక రుణాలను ప్రకటించింది. 2020లో అన్ని వర్గాలు ఆర్థికంగా చితికిపోవడంతో 2021 పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.