యూరీ ఉగ్రదాడి: కూలీల హస్తం, ఎన్ఐఏ దర్యాప్తులో సంచలనం
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని యూరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడికి సంబంధించిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు పక్కాగా సైనిక శిబిరంపై దాడి చేసి 18 మంది భారత జవాన్లను అంతమొందించిన సంగతి తెలిసిందే.
ఈ ఉగ్రదాడిలో పాక్ ముష్కరలకు స్థానికులు సాయం చేశారని చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తులో తేలింది. యూరీ సైనిక శిబిరంలో సరుకు రవాణా కూలీలు, ప్లంబర్లు, ఎలక్ట్రిషిన్లుగా పనిచేస్తున్నవారిలో కొంత మంది ఆర్మీ బేస్కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేశారు.
అంతేకాదు పాక్ ఉగ్రవాదుల తరుపున గూఢచర్యం కూడా నిర్వహించినట్లు ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యూరీ ఉగ్రదాడి కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్ఐఏ అధికారులు గురువారం కొందరు కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
యూరీలోని 12వ సైనిక బెటాలియన్ క్యాంపులో సుమారు 40 మంది సరుకు రవాణా కూలీలు పనిచేస్తున్నారు. సైనిక శిబిరంలోని జవాన్లు, అధికారులకు అవసరమయ్యే నిత్యావసరాలు, ఇతర సరుకులు తీసుకొచ్చే వీరంతా ప్రైవేట్ వ్యక్తులే. రోజు వారీ కూలీలు తీసుకొచ్చిన నిత్యావసరాలను నిలువ చేసే వంటశాలకు సమీపంలోనే ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించడాన్ని బట్టిచూస్తే ఆ మార్గం వీరు సూచించిందే అయి ఉంటుందని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇక ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించడానికి ముందు ఇద్దరు గూఢచారులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని హజీ పీర్ పాస్ నుంచి సరిహద్దులోని కొండల నుంచి అటవీమార్గం గుండా ఉరీ సైనిక స్థావరం వరకు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో రెండు మూడు సార్లు రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తెలిసింది.
ఈ మార్గం ఉగ్రవాదులకు పూర్తిగా సురక్షితమైన మార్గమమని నిర్ధారించుకున్న జైషే ఉగ్రవాదులకు కబురు పంపింది. కాగా యూరీ సైనిక శిబిరంపై ఉగ్రదాడి జరగడానికి ఒక రోజు ముందు సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్ తదితరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జమ్మూ పోలీసులు సేకరించారు.