అల్లర్లు: నరేంద్ర మోడీకి అమెరికా కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. కొద్ది గంటల్లో అమెరికా గడ్డపై కాలుమోపనున్న మోడీకి న్యూయార్క్ కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. 2002 నాటి గోద్రా అల్లర్ల కేసుకు సంబంధించి న్యూయార్క్ దక్షిణ జిల్లా ఫెడరల్ కోర్టు నుంచి జారీ అయిన సమన్లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.
అమెరికన్ జస్టిస్ సెంటర్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ సమన్లు జారీ అయ్యాయి. కాగా, 21 రోజుల్లోగా ఈ నోటీసులపై మోడీ తన స్పందనను తెలియజేయాల్సి ఉంది. గుజరాత్ అల్లర్ల తర్వాత అమెరికా.. సుమారు తొమ్మిదేళ్లపాటు మోడీకి వీసా నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా, దేశాధినేతగా మోడీకి ఈ కేసు వర్తించదని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
మోడీకి సమన్ల విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్రన్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. కాగా, మోడీ శుక్రవారం నుంచి సెప్టెంబర్ 30వరకు అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఫ్రాంక్ఫర్డ్లో కొద్దిసేపే గడిపిన అనంతరం మోడీ న్యూయార్క్ చేరుకుంటారు.
మోడీకి డాక్టరేట్ ప్రకటించిన అమెరికా వర్సిటీ
భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికాలోని సౌతర్న్ యూనివర్సిటీ సిస్టమ్ ఆఫ్ లూసియానా గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. గురువారం జరిగిన వర్సిటీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.