టీసీఎస్కు భారీ ఫైన్: ఐటీ పరిశ్రమను తాకనుందా?
న్యూఢిల్లీ: సాఫ్టువేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసు పైన అమెరికా కోర్టు వేసిన ఆరువేల కోట్ల జరిమానా అంశం దేశంలోని మిగతా ఐటీ పరిశ్రమల పైన పడనుందా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావంతో హెల్త్ కేర్ వ్యాపారంలో ప్రతిష్ట కలిగిన టీసీఎస్ పైన భారత్లో నమ్మకం కోల్పోయే ప్రమాదముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత క్లిష్టమైన రాజకీయ వాతావరణంలో, భారత కంపెనీలు తేలికైన పద్ధతులు ఎంచుకొని ఇబ్బందులు పడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో భారత ఐటీ రంగం లీగల్గా చాలా సమస్యలకు గురవుతుందని సాఫ్టువేర్ నేషనల్ అసోసియేషన్ తెలిపింది.
కాగా, టాటా గ్రూప్లోని దేశీయ ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)అమెరికా అనుబంధ సంస్థ టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ సంస్థలపై విస్కాన్సిన్లోని అమెరికా ఫెడరల్ కోర్టు దాదాపు రూ.6,000 కోట్ల (940 మిలియన్ డాలర్లు) జరిమానా విధించిన విషయం తెలిసిందే.
అమెరికాకు చెందిన హెల్త్కేర్ సాఫ్ట్వేర్ కంపెనీ 'ఎపిక్ సిస్టమ్స్' తాలూకు సాఫ్ట్వేర్ తస్కరణ కేసులో విస్కాన్సిస్ లోని యూఎస్ ఫెడరల్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. కాగా, దీనిపై తాము ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేస్తామని టీసీఎస్ వెల్లడించింది కూడా.