ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన గ్యాస్ ట్యాంకర్: దట్టమైన పొగమంచు..మితిమీరిన వేగం: 8 మంది దుర్మరణం
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉత్తర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సును గ్యాస్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పొగమంచు వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడించారు.
రైతాంగ దీక్షలపై సుప్రీంకోర్టు ఆగ్రహం: కీలక ఆదేశాలు జారీ: నోటీసులు: రైతు సంఘాల ఇంప్లీడ్
ఉత్తర ప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొరాదాబాద్ నుంచి అలీగఢ్కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు సంభాల్ జిల్లాలోని ధనరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మానక్పూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. అలీగఢ్ నుంచి మొరాదాబాద్ వైపునకు వెళ్తోన్న గ్యాస్ ట్యాంకర్ ఎదురుగా అతివేగంగా బస్సును ఢీ కొట్టింది. దీని వేగానికి సగం బస్సు ధ్వంసమైంది. ముందు సీట్లతో పాటు బస్సుకు కుడివైపు కూర్చున్న ప్రయాణికులు దుర్మరణం పాలయ్యరు. బస్సు కుడివైపు మొత్తం కోసుకుపోయింది.
మృతుల్లో ఆర్టీసీ బస్ డ్రైవర్ కూడా ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తోన్న వాహనాలు కనిపించకపోవడం, అలాంటి పరిస్థితుల్లోనూ గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడిపించడం ప్రమాదానికి దారి తీసినట్లు ధనరీ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సంభల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ చక్రేష్ మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
Recommended Video
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. గాయపడ్డ వారికి నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన జిల్లా వైద్య శాఖాధికారులకు సూచించారు. దట్టంగా పొగమంచు అలముకున్న పరిస్థితుల్లో గ్యాస్ ట్యాంకర్ను అతి వేగంగా నడిపించడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని మొరాదాబాద్ రేంజ్ డీఐజీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.