గప్ ‘చిప్’గా పెట్రోల్ బంకుల దందా.. షాకింగ్ నిజాలు, వాహనదారుల జేబుకు చిల్లు
పెట్రోల్ బంకుల భారీ దందా వెలుగులోకి వచ్చింది. యూపీలో 1000కి పైగా పెట్రోల్ బంకులలో చిప్ ఆధారిత డివైజ్ ను వాడుతూ వాహనదారులను మోసగిస్తున్నారు. ఈ రాకెట్ ఇతర రాష్ట్రాల్లో కూడా సాగుతోన్నట్లు తెలుస్తోంది.
లక్నో: ఉత్తరప్రదేశ్ లో పెట్రోల్ బంకుల భారీ దందా వెలుగులోకి వచ్చింది. 1000కి పైగా పెట్రోల్ బంకులలో చిప్ ఆధారిత డివైజ్ ను వాడుతూ వాహనదారులను మోసగిస్తున్నాయని, దీని ద్వారా భారీ మొత్తంలో లాభాలను ఆర్జిస్తున్నాయని వెల్లడైంది.
యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన దాడులలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ దందా కేవలం ఉత్తరప్రదేశ్ లోనే కాక, చాప కింద నీరులా ఇతర రాష్ట్రాల్లో కూడా సాగిపోతున్నట్లు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణలో తెలిసింది.
ఈ దందాకు సంబంధించి ఇప్పటికే 23 మందిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయగా.. ఆ రాష్ట్ర రాజధాని పరిధిలోని పలు పెట్రోల్ బంకులను సీజ్ చేశారు. అరెస్టు అయిన వారిలో తొమ్మిది మంది పెట్రోల్ బంకు యజమానులు, తొమ్మిది మంది మేనేజర్లు, నలుగురు ఉద్యోగులు, ఎలక్ట్రిషియన్ ఉన్నారు.
వాహనదారులకు పెట్రోలు, డీజిల్ తక్కువగా వచ్చేలా చేయడానికి చిప్ ను ఇన్ స్టాల్ చేసి మోసగిస్తున్నారు. ఈ చిప్ ను ఇన్ స్టాల్ చేసే ముఖ్యుడు ఎలక్ట్రిషియన్ రాజేందర్ ను పోలీసులు పట్టుకున్నారు.
పోలీసుల విచారణలో పెట్రోల్ బంకుల్లో చిప్ లను ఇన్ స్టాల్ చేస్తున్నట్టు అతడు అంగీకరించాడు. మిగతా రాష్ట్రాల్లో కూడా వీటిని ఇన్ స్టాల్ చేసినట్టు చెప్పాడని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరవింద్ చతుర్వేది తెలిపారు.
పెట్రోల్ బంకులు చేస్తున్న ఈ మూకుమ్మడి అక్రమాలపై వినియోగదారుల ఫిర్యాదు మేరకు, యూపీ డీజీపీ సుల్ఖాన్ సింగ్ ఈ కేసును స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు అప్పగించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసిన వారి విచారణలో ఈ అక్రమాల వెనుక పెద్ద రాకెటే ఉందని వెల్లడైంది.
పెట్రోల్ బంకులు ఈ చిప్ ను వాడడం వల్ల వాహనదారులు చెల్లించే డబ్బుకు సరిపడా పెట్రోలు, డీజిల్ రాదని, తక్కువ పోసినా, ట్యాంకు ఫుల్ అయినట్టు ఇండికేషన్ వస్తుందని విచారణలో తెలిసినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 శాతం ప్యూయల్ ఫిల్లింగ్ స్టేషనల్లో ఈ చిప్ ను ఇన్ స్టాల్ చేసినట్టు తెలిసింది.
అధికారులు జరిపిన దాడుల్లో పలు మిషన్లను, చిప్ లను, రిమోట్ కంట్రోల్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అరెస్టు అయిన వారిలో రాజేందర్, వీరేంద్ర సింగ్ భడోరియా,షేర్డ్ చంద్ర వైశ్య, రాజన్ అవస్థి, అశోక్ కుమార్ పాల్, అనూప్ మిట్టల్, హసీబ్ అహ్మద్, గోవింద్ పాండే, ప్రేమ్ కుమార్ ఓజ్హ ఉన్నారు.
ఈ దందా ద్వారా పెట్రోల్ బంకులు ప్రైమ్ ఏరియాలో నెలకు కనీసం రూ.12 నుంచి రూ.15 లక్షల మేర అదనంగా సొమ్మును ఆర్జిస్తున్నట్టు అధికారులు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనీసం రూ.ఆరు నుంచి రూ.ఏడు లక్షలు అదనంగా సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.