యూపీలో దారుణం-సొంత కోడలినే రూ.80వేలకు-మాయ మాటలు చెప్పి అమ్మేసిన మామ
ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన సొంత కోడలిని కొంతమంది వ్యక్తులకు విక్రయించాడు. కేవలం రూ.80వేలకు కక్కుర్తి పడి కొడుకు భార్యను అమ్మకానికి పెట్టాడు. కొడుకు,కోడలికి ఎక్కడా అనుమానం రాకుండా ఈ కుట్రకు తెరలేపాడు. అనారోగ్యం పేరుతో కోడలిని ఇంటికి రప్పించుకుని... గుజరాత్కు చెందిన ఓ ముఠాకు ఆమెను అమ్మేశాడు. ఇంతలోనే కొడుకుకి తండ్రిపై ఎక్కడో అనుమానం వచ్చింది. చెప్పా పెట్టకుండా ఇంటికి వెళ్లాడు. ఇంట్లో తన భార్య,తండ్రి ఇద్దరూ కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు అతని భార్యను ఆ ముఠా నుంచి విడిపించారు.

అసలేం జరిగింది...
ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లా మల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రిన్స్ వర్మ అనే యువకుడు 2019లో అసోంకి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆన్లైన్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమ,పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత ప్రిన్స్ వర్మ భార్యతో కలిసి ఘజియాబాద్లో ఉంటున్నాడు. అక్కడే క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇటీవల ఓరోజు మల్లాపూర్లో నివసించే ప్రిన్స్ వర్మ తండ్రి చంద్రరామ్ వర్మ అతనికి ఫోన్ చేశాడు. తన ఆరోగ్యం బాగోలేదని... కొద్దిరోజులు కోడలిని ఇంటికి పంపిస్తే తన బాగోగులు చూసుకుంటుందని కోరాడు.

రూ.80వేలకు కోడలిని...
తండ్రి మాటలు నమ్మి ప్రిన్స్ వర్మ తన భార్యను మల్లాపూర్లోని తండ్రి వద్దకు పంపించాడు. ఈ నెల 4న ఆమె అక్కడికి వెళ్లింది. అయితే అప్పటికే ఆమెను విక్రయించేందుకు గుజరాత్కు చెందిన రాము గౌతమ్ అనే వ్యక్తితో చంద్రరామ్ వర్మ డీల్ కుదుర్చుకున్నాడు. ఈ నెల 5న ఆ ముఠా నుంచి రూ.80 వేలు తీసుకుని కోడలిని వారికి అప్పగించాడు. ఆ వ్యక్తులు నిన్ను ఘజియాబాద్లో దిగబెడుతారంటూ కోడలికి మాయ మాటలు చెప్పి పంపించాడు. దీంతో ఆ యువతిని తీసుకుని వారు స్థానిక రైల్వే స్టేషన్కు వెళ్లారు.

రైల్వే స్టేషన్లో పట్టుబడ్డ ముఠా...
భార్యను ఒంటరిగా ఇంటికి పంపించినప్పటి నుంచి ప్రిన్స్ వర్మను ఎక్కడో ఏదో అనుమానం వెంటాడుతూనే ఉంది. ఉండబట్టలేక అతను కూడా 4వ తేదీ రాత్రే ఇంటికి బయలుదేరాడు. 5వ తేదీ ఇంటికి చేరుకోగా... ఆ సమయానికి ఇంట్లో తండ్రి,భార్య ఇద్దరూ కనిపించలేదు. తెలిసినవాళ్లను అడిగితే తమకేమీ తెలియదన్నారు. దీంతో ప్రిన్స్ వర్మ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ పోలీస్ టీమ్ రంగంలో దిగి మల్లాపూర్ సహా చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృతంగా గాలించింది. ఈ క్రమంలో స్థానిక రైల్వే స్టేషన్లో ఆ యువతిని కొంతమంది వ్యక్తులతో గుర్తించారు. ఆ వ్యక్తులను అరెస్ట్ చేసి వారి చెర నుంచి ఆమెను విడిపించారు. మొత్తం 8 మందిని అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

మహిళలను విక్రయించే వ్యాపారం...
నిజానికి ప్రిన్స్ వర్మకు తెలియని విషయమేంటంటే... అతని తండ్రి చంద్రరామ్ మహిళలను విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పటివరకూ 300 మంది మహిళలను అతను విక్రయించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో గుజరాత్కి చెందిన రాము గౌతమ్ అనే వ్యక్తి... తనకు పెళ్లి కావట్లేదని,ఒక అమ్మాయిని చూసి పెట్టాలని చంద్రరామ్ను సంప్రదించాడు. చంద్రరామ్ చాలానే ప్రయత్నాలు చేసినప్పటికీ అవేవీ ఫలించలేదు. దీంతో ఎవరో ఎందుకు... తన కోడలిని అతనికి అమ్మేస్తే పోతుంది కదా అనుకున్నాడు. ఇందుకోసం రూ.80వేలకు డీల్ కుదుర్చుకుని వారిని ఇంటికి పిలిచాడు. అదే సమయంలో కోడలిని కూడా ఘజియాబాద్ నుంచి పిలిపించి వారికి అప్పగించాడు. మాయ మాటలు చెప్పి ఆమెను వారితో పంపించాడు. సకాలంలో ప్రిన్స్ వర్మ మల్లాపూర్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్యను ఆ ముఠా నుంచి విడిపించుకోగలిగాడు. ప్రస్తుతం అతని తండ్రి చంద్రరామ్ పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications