ఒక్క డాక్టర్ కూడా రాలేదు-బిడ్డను కోల్పోయాం-ఇంకెంత ఓపిక పట్టాలి-బోరున విలపించిన తల్లిదండ్రులు
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లినా... 'కరోనా'నే అయి ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ఆస్పత్రులైతే 'కరోనా' అనుమానంతో పేషెంట్లను చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నాన్-కోవిడ్ పేషెంట్ల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని... కరోనా భయంతో వైద్యులు కూడా వారిని పట్టించుకునే పరిస్థితి లేదన్న విమర్శలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి తమ బిడ్డను కోల్పోయామని ఓ తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు.

అసలేం జరిగింది...
ఉత్తరప్రదేశ్ రాజధాని 40కి.మీ దూరంలో ఉన్న బరాబంకి జిల్లా కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. ఆదివారం(మే 30) ఓ తల్లిదండ్రులు ఐదేళ్ల తమ చిన్నారిని ఎత్తుకుని ఉరుకులు పరుగులతో ఆ ఆస్పత్రికి చేరుకున్నారు. తమ చిన్నారి హఠాత్తుగా కిందపడిపోయిందని... అప్పటినుంచి ఉలుకు పలుకు లేదని అక్కడి వైద్య సిబ్బందితో చెప్పారు. అయితే ఆమెకు కరోనా సోకి ఉండొచ్చునన్న అనుమానంతో దాదాపు 2 గంటల పాటు ఆ చిన్నారి వద్దకు ఒక్క వైద్యుడు కూడా రాలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో తమ బిడ్డను బతికించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

కోవిడ్ భయంతో ఎవరూ రాలేదు...
'ఆస్పత్రిలో అంతా కోవిడ్ గురించి మాట్లాడుతున్నవారే. మా పాప కూడా కరోనా పేషెంట్ కావొచ్చునేమో అన్న భయంతో ఆమెకు వైద్య పరీక్షలు చేసేందుకు ఏ వైద్యుడూ రాలేదు. ఒక్కరంటే ఒక్క డాక్టర్ కూడా రాలేదు. మా బిడ్డ మంచం పైనుంచి పడింది అంతే. ఆమెకు ఎలాంటి వ్యాధులు లేవు. కింద పడినప్పటి నుంచి ఉలుకు పలుకు లేదు. ఇక్కడికి తీసుకొచ్చాక... రెండు గంటల పాటు ఎవరూ మా బిడ్డను పట్టించుకోలేదు. దీంతో ఆమె చనిపోయింది.' అని ఆ తల్లిదండ్రులు వాపోయారు.

కొట్టిపారేసిన వైద్యాధికారులు...
మరోవైపు అక్కడి వైద్యాధికారుల వాదన భిన్నంగా ఉంది. ఆ చిన్నారి బిల్డింగ్ టెర్రస్ పైనుంచి కింద పడిపోయిందని... ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులే తమతో చెప్పారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీకేఎస్ చౌహాన్ తెలిపారు. ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికే తను చనిపోయిందన్నారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు హృదయవిదారకంగా విలపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Recommended Video

'ఏంటీ డ్రామా... ఏదైనా ఉంటే ఫిర్యాదు రాసివ్వండి'
'ఆస్పత్రిలో రెండు గంటల పాటు మేము డాక్టర్ల కోసం ఎదురుచూశాం. ఒక్క డాక్టర్ కూడా రాలేదు. పైగా ఓపిక పట్టాలని చెప్పారు. ఇప్పుడు మా బిడ్డ చనిపోయింది. ఇప్పుడు కూడా నేనూ ఓపికతోనే ఉండాలా....?' అంటూ వైరల్గా మారిన ఓ వీడియోలో ఆ చిన్నారి తండ్రి వాపోయాడు.మరో వీడియోలో ఆస్పత్రి గేటు వద్ద పోలీసులు ఆ తల్లిదండ్రులను ప్రశ్నించడం కనిపిస్తోంది. 'ఏంటీ డ్రామా...' అని పోలీసులు ప్రశ్నించగా... 'మా బిడ్డ చనిపోయిన బాధలో ఉన్నాం... ఇది డ్రామా అని మీరంటున్నారు..' అని ఆ తల్లిదండ్రులు వాపోయారు. దానికి సదరు పోలీసులు... 'ఏదైనా ఉంటే ఫిర్యాదు రాసివ్వండి..' అంటూ నిర్లక్ష్యంగా బదులిచ్చారు. దీంతో ఆ తండ్రి చనిపోయిన తన బిడ్డను భుజాన వేసుకుని ధీనంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు.












Click it and Unblock the Notifications