ఉత్తరాఖండ్ వర్ష బీభత్సం: 34కు చేరిన మృతుల సంఖ్య, రూ. 4 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జల విలయం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 34 మంది మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ప్రకటించారు.
ఇళ్లు కోల్పోయిన వారికి రూ. 1.9 లక్షల చొప్పున, మూగ జీవాలను కోల్పోయినవారికి సాధ్యమైనంతమేర సాయం చేస్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు తీసుకుంటోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలను త్వరగా పంపాలని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముఖ్యమంత్రి పుష్కర్ ఆదేశించారు. ఆర్మీ నుంచి మూడు హెలికాప్టర్లను వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు తెలిపారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ అశోక్ కుమార్తో కలిసి సీఎం పుష్కర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పలు ప్రాంతాల్లో సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది.

కాగా, గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదనీటితో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద ఉధృతికి పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక నైనిటాల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నైనిటాల్ సరస్సు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అనేక గ్రామాలు నీటమునిగిపోయాయి. దీంతో ప్రజలు కాలు బయటపెట్టలేని పరిస్థితులు నెలకొని ఇబ్బందులు పడుతున్నారు. నైనిటాల్ లోని మాల్ రోడ్, నైనా దేవి దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతాలు నీటమునిగాయి. రాంగఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. రాంనగర్-రాణిఖేట్ రోడ్లోని ఓ రిసార్టులో చిక్కుకున్న 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి.
వరద ఉధృతికి రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. హల్ద్వానీ ప్రాంతంలో గౌలా నది ఉప్పొంగడంతో ఆ నదిపై ఉన్న వంతెన కొంతమేర కొట్టుకుపోయింది. అదే సమయంలో ఓ వ్యక్తి బైక్ పై వంతెన మీదకు రావడం గమనించిన స్థానికులు, అధికారులు అతడిని హెచ్చరించడంతో వెనుదిరిగాడు. దీంతో ప్రమాదం తప్పింది. చంపావత్ ప్రాంతంలో చల్తీ నదికి వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది.
Ohh this is the situation of #Uttarakhand https://t.co/r4zhyR6H8c
— Arvind ®️athod 🇮🇳 (@Rathod_Arvind2) October 19, 2021
భారీ వర్షాలు, వరదల కారణంగా కేదారనాథ్, బధ్రీనాథ్ యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ ఆలయాలకు వెళ్తూ మార్గమధ్యంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతి తగ్గిన తర్వాతే యాత్రికులను, పర్యాటకులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, ఉత్తరాఖండ్ వర్షాలు, వదర పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ దామి, కేంద్రమంత్రి అజయ్ భట్ లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు.
Guys, pray for Uttarakhand. This won’t attract mainstream headlines, but they do need your prayers and help to get by (many do) #UttarakhandRains https://t.co/wZX6lnwwkW
— snubby (@foamfarm) October 19, 2021
మరోవైపుర, ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న హైదరాబాదీ యువతులను సహాయ బృందాలు కాపాడాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో సఫారీ కోసం వెళ్లిన వరదల్లో చిక్కుకున్న సుష్మ అనే మహిళ, ఆమె స్నేహిుతురాళ్లు తమ పరిస్థితి గురించి తెలంగాణ సీఎంవో, కేంద్రమంత్రులకు ట్వీట్ చేయడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దీంతో ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడిన కేంద్రమంత్రి సహాయ చర్యలకు ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న సుష్మ,ఆమె స్నేహితులను హాయ బృందాలు కాపాడాయి. దీంతో సుష్మ మిత్రబృందం తమ వాహనంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ మేరకు వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications