కన్నతల్లిని బతికించుకునేందుకు తోపుడు బండిపై ఆస్పత్రికి... ఆ తర్వాత
పేగును తెంచి మరీ జన్మనిచ్చిన తల్లి మరణశయ్యపై ఉంటే బతికించుకోవడానికి ఆ బిడ్డ పడిన తాపత్రయం వృథాగా మిగిలిపోయింది. కన్న తల్లి రుణం తీర్చుకోవడానికి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడనే సంకల్పంతో చేసిన ప్రయత్నం నీరుకారిపోయింది. నాలుగు కిలోమీటర్ల దూరం అంబులెన్స్ పంపించడంలో అలసత్వం చూపించిన అధికారుల బాధ్యతా రాహిత్యానికి మాతృమూర్తిని కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని జలాలాబాద్ పట్టణానికి చెందిన తల్లీ కొడుకులు బీనాదేవి, దినేష్ ల కథ ఇది.
బీనాదేవి (65)కి బుధవారం ఉదయం అకస్మాత్తుగా కడుపునొప్పి వచ్చి మెలికలు తిరిగిపోయారు. తీవ్రమైన బాధతో ఆర్తనాదాలు చేశారు. అంబులెన్సు కోసం ఫోను చేశారు. ఎంతసేపు చూసినా అది కనుచూపుమేరలో కనపడలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమారుడే తల్లిని తోపుడు బండిపై పడుకోబట్టి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నెట్టుకుంటూ వచ్చాడు. తల్లిని బతికించుకోవచ్చని ఆశపడ్డాడు. కానీ విధి వక్రీకరించింది. దినేష్ కు విషాదాన్ని మిగిల్చింది. బీనాదేవిని పరీక్షించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అమిత్ యాదవ్ ఆమె అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. సకాలంలో అంబులెన్స రాక, వైద్యసేవలు అందక మృత్యుముఖంలోకి జారుకున్న తల్లిని చూసి శోకించిన దినేష్ దు:ఖాన్ని దిగమింగుకొని అదే తోపుడు బండిపై ఇంటికి తీసుకువచ్చాడు.
బీనాదేవి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని అంబులెన్సు సర్వీసులను పర్యవేక్షించే అధికారి తెలిపారు. తాము పరీక్షించేసరికే ఆమె మరణించినట్లు డాక్టర్ అమిత్ యాదవ్ వెల్లడించారు. ఈ సంఘటనపై షాజహాన్పుర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పీకే వర్మ స్పందించారు. జరిగిన విషయంపై వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు. రోగి నుంచి ఫోన్ వచ్చిన 30 నిముషాల్లోనే అంబులెన్స్ చేరుకోవాలని, దూరం తక్కువగా ఉంటే మరింత తొందరగా చేరుకోవాలనే నిబంధన ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పథక్ జరిగిన సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అలసత్వం వహించినవారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు.
తోపుడు బండిపై తల్లి మృతదేశం.. హృదయవిదారకం.!!#UttarPradesh #UPNews #UttarPradeshNews #Mother #Son #OneIndiaTelugu pic.twitter.com/uNXwHr623j
— oneindiatelugu (@oneindiatelugu) August 18, 2022