టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ షురూ: ఆ వ్యాక్సిన్ మాత్రమే: స్కూళ్లల్లో సెంటర్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది. రెండు రోజుల వ్యవధిలో 15 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కొత్తగా 27 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. అదే సమయంలో- ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతమౌతోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 1,500 దాటేశాయి. రోజురోజుకూ ఇవి పెరుగుతున్నాయి.
సరిగ్గా ఏడాదిలో..
ఈ పరిణామాల మధ్య టీనేజర్లకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 15 నుంచి 18 సంవత్సరాల్లోపు వయస్సున్న వారికి ఇవ్వాళ్టి నుంచి వ్యాక్సినేషన్ మొదలు కానుంది. గత ఏడాది జనవరి 16వ తేదీన దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి యుక్త వయస్కుల వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకుని రావడంలో కేంద్ర ప్రభుత్వం సఫలం కాగలిగింది. ఇప్పటిదాకా 18 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తోన్న విషయం తెలిసిందే.
భారీ డిమాండ్..
టీనేజర్లకు వ్యాక్సినేషన్కు భారీ డిమాండ్ నెలకొంది. ఈ నెల 1వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా.. ఇప్పటిదాకా ఎనిమిది లక్షల మందికి పైగా అర్హులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ https://www.cowin.gov.in/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నిరంతరంగా ప్రక్రియ. వ్యాక్సిన్ డోసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, ఇతర హెల్త్ కేర్ సెంటర్లలో వ్యాక్సిన్ వేసుకోవచ్చు.
కోవాగ్జిన్..
ప్రస్తుతం దేశంలో ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ను విస్తృతంగా వినియోగిస్తోన్న విషయం తెలిసిందే. దీనితోపాటు స్పుత్నిక్ వీ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అది పరిమితంగా ఉంటోంది. వ్యాక్సినేషన్లో కోవిషీల్డ్ వాటా అధికంగా ఉంటోంది. కాగా- ఇఫ్పుడు తాజా ప్రారంభించనున్న టీనేజర్ల వ్యాక్సినేషన్లో కోవాగ్జిన్ను వినియోగించనుంది కేంద్ర ప్రభుత్వం. టీనేజర్లకు కూడా వ్యాక్సిన్ను ఇచ్చేలా కోవాగ్జిన్ను మరింత అభివృద్ధి చేసింది హైదరాబాదీ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్.
స్కూళ్లల్లో కూడా..
టీనేజర్లకు వ్యాక్సినేషన్ కోసం స్కూళ్లను కూడా వినియోగించుకోనుంది కేంద్ర ప్రభుత్వం. స్కూళ్లు, ఇతర విద్యాసంస్థల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను నెలకొల్పనుంది. 2007 అంతకంటే ముందు జన్మించిన వారు ఈ వ్యాక్సినేషన్ కోసం అర్హులు. కోవిన్ పోర్టల్ ద్వారా తమ పేర్లను నమోదు చేయించుకున్న వారు తొలిదశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో టీకాలను వేయించుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన చోట్ల స్కూళ్లల్లోనూ టీకాలు వేస్తామని కేంద్రం పేర్కొంది.
10 నుంచి అదనపు డోసు..
ఈ నెల 10వ తేదీ నుంచి థర్డ్ డోస్ కూడా అందుబాటులోకి రానుంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వయోధిక వృద్ధులు, హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లకు తొలిదశలో ఈ అదనపు డోస్ వ్యాక్సిన్కు అర్హులు. మూడున్నర రెట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ అదనపు డోసులు, టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అనుమతులను మంజూరు చేసింది. అనేక రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కోవిడ్ పాజిటివ్గా తేలడాన్ని పరిగణనలోకి తీసుకుంది.