ఇండియాలో వ్యాక్సిన్ల కొరత, పొంచి ఉన్న కరోనా ముప్పు.. ఏయే రాష్ట్రాలలో తీవ్రమైన కొరత ఉందంటే !!
కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు. కరోనా థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదముందని, యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుంటే, భారతదేశంలో టీకాల కొరత వివిధ రాష్ట్రాలలో పరిస్థితిని దారుణంగా తయారు చేస్తుంది. భారతదేశంలో టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిదానంగా కొనసాగుతుంది.

కేరళ, ఢిల్లీలలో అతి తక్కువ వ్యాక్సిన్ ల కొరత
వ్యాక్సిన్ ల కొరత తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు, అతి తక్కువ కొరత ఉన్న రాష్ట్రాలను చూస్తే కేరళ, ఢిల్లీలలో అతి తక్కువ వ్యాక్సిన్ ల కొరత ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో విపరీతమైన టీకాల కొరత ఉందని ఆయా రాష్ట్రాల డేటా విశ్లేషణను బట్టి అర్థమవుతుంది. కేరళ, ఢిల్లీలో వ్యాక్సిన్ కొరత 22 శాతం ఉంటే, బీహార్లో 71 శాతం, రాజస్థాన్ మరియు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో 66% వ్యాక్సిన్ల కొరత ఉన్నట్లుగా తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా మొత్తం టీకా కొరత 54 శాతం ఉందని అంచనా
ఇక దేశవ్యాప్తంగా మొత్తం టీకా కొరత 54 శాతం ఉందని సమాచారం. అతిపెద్ద దేశమైన భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రాలలో చాలా చోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా వెనకబడిపోయింది. కేరళ, ఢిల్లీ ఇప్పటివరకు అత్యధిక టీకా రికార్డు ఉన్న రాష్ట్రాలుగా నిలిచినప్పటికీ, డిసెంబరు నాటికి 60 శాతం జనాభాకు టీకాలు వేసే లక్ష్య రేటును చేరుకోవడం సాధ్యం కాదని తాజా లెక్కల బట్టి అర్థమవుతుంది. ఇక పంజాబ్లో టీకా కొరత 26 శాతం, కర్ణాటక 30 శాతం, గుజరాత్లో 37 శాతం వ్యాక్సిన్లు కొరత ఉన్నాయి.

తీవ్రమైన వ్యాక్సిన్ కొరత ఉన్న రాష్ట్రాలివే
టీకాల కొరత బీహార్లో 71 శాతం, రాజస్థాన్ మరియు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో 66%, ఉత్తర ప్రదేశ్లో 64 శాతం, జార్ఖండ్ 62 శాతం గా ఉంది, ఈ రెండు రాష్ట్రాలలో అత్యధిక టీకాల కొరత ఉంది. ఇదిలా ఉంటే దేశం మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమం 36 కోట్లు దాటిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. 18-44 వయస్సు గలవారికి 11 కోట్లకు పైగా మోతాదులను అందించినట్లు తెలిపింది.
గత 24 గంటల్లో 40 లక్షలకు పైగా వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

వ్యాక్సినేషన్ మాత్రమే ప్రత్యామ్నాయం అంటున్న నిపుణులు .. కొరతతో కరోనా భయం
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా వైరస్ వైవిధ్యాలు నివేదించబడుతున్నాయి. భారతదేశంలో మొట్టమొదట కనుగొనబడిన డెల్టా వేరియంట్, దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగించిన వేరియంట్ కాగా, ఇప్పుడు కొత్తగా కప్ప వేరియంట్, లాంబ్డా వేరియంట్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావలసిన వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం కరోనా భయాన్ని మరింత పెంచుతోంది.












Click it and Unblock the Notifications