ఇక స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లు- గంటకు 220 కిలోమీటర్ల వేగంతో: శతాబ్దికి రీప్లేస్..!!
న్యూఢిల్లీ: వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రజాదరణను పొందుతోన్నాయి. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఈ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంటోంది. ఇప్పటివరకు ఎనిమిది రైళ్లు వేర్వేరు రాష్ట్రాల్లో వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సిరీస్ లో ఎనిమిదో రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తిరుగాడుతోంది. మిగిలిన రైళ్లతో పోల్చుకుంటే గరిష్ఠంగా మూడింతల వేగంతో- పరుగులు పెడుతోండటంతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.
రోజురోజుకూ..
ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ల రేట్లు రెట్టింపు అయినప్పటికీ ప్రయాణికులు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఫలితంగా వారి తాకిడి ఏ మాత్రం తగ్గట్లేదు. సమయం, వేగానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. వివిధ నగరాల మధ్య వందలాది కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే విషయంలో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో వందే భారత్ రైళ్లపై ఆధారపడుతున్నారు.
ఇప్పటికే మినీ అనౌన్స్మెంట్..
ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం- ఇప్పటికే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వాటి సంఖ్యను పెంచనుంది. ఈ మేరకు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలను పంపించాలని ఆదేశించింది. దీనిపై రైల్వే బోర్డు కసరత్తు సైతం పూర్తి చేసింది. తక్కువ కిలోమీటర్ల దూరంలో రాకపోకలు సాగించడానికి అనువుగా మినీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది బోగీలు మాత్రమే ఉండేలా దీన్ని డిజైన్ చేసింది రైల్వే బోర్డు.
ఇక స్లీపర్ రైళ్లు కూడా..
ఇక తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో కొత్తగా స్లీపర్ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి అవసరమైన టెండర్ల ప్రక్రియను కూడా రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఈ టెండర్ల ప్రక్రియను రైల్వే బోర్డు పర్యవేక్షిస్తోంది. కొత్తగా 400 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రూపొందించడానికి అధికారులు టెండర్లను జారీ చేశారు.
200 చొప్పున..
నాలుగు చొప్పున దేశీయ, విదేశీ కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)ని జారీ చేశాయి. ఈ 400 రైళ్లల్లో సగం స్లీపర్ క్లాస్ కు చెందినవే. మిగిలిన 200.. చైర్ కార్ సర్వీసులు. స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లు గరిష్ఠంగా 200 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేలా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శతాబ్ది ఎక్స్ ప్రెస్ ల స్థానంలో ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఛైర్ కార్లే..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎనిమిది వందే భారత్ రైళ్లు కూడా ఛైర్ కార్లే. ఇందులో స్లీపర్ కోచ్, బెర్త్ సౌకర్యం లేదు. తాజాగా ప్రయాణికుల నుంచి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని వందే భారత్ స్లీపర్ వెర్షన్ను పట్టాల మీదికి తీసుకుని రావడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటోన్నారు. దూర ప్రయాణాలు సాగించే వారికి వెసలుబాటుగా సెమీ హైస్పీడ్ స్లీపర్ రైళ్లను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకుని వస్తామని స్పష్టం చేస్తోన్నారు.