‘కరోనా పాజిటివ్’ కనికా కపూర్ పార్టీ: వసుంధరా రాజే, దుష్యంత్ సెల్ఫ్ క్వారంటైన్, రాష్ట్రపతి భవన్లోనూ
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా, బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈమె ఇటీవలే లండన్లో పర్యటించిన ఆమె మార్చి 15న స్వదేశానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బసచేసింది.
లండన్ నుంచి వచ్చి కనికా కపూర్ గ్రాండ్ పార్టీ..
అంతేగాక, లక్నోలోని ఆ హోటల్లో తన స్నేహితులు, కుటుంబసభ్యులకు గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో చాలా మంది రాజకీయ నాయకులతోపాటు సామజికవేత్తలు హాజరయ్యారు. ఆ తర్వాత వైద్యపరీక్షలు నిర్వహించుకుంటే కనికా కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, లండన్ నుంచి వచ్చిన ఆమె లండన్ పర్యటనపై ఎవరికీ చెప్పకపోవడం గమనార్హం.
వసుంధర రాజే, దుష్యంత్ సెల్ఫ్ క్వారంటైన్..
కాగా, కనికా పార్టీకి రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్, టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో వసుంధర రాజే, దుష్యంత్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కనికా పార్టీకి వెళ్లినవారిలో ఆందోళనలు నెలకొన్నాయి. తమకు కూడా కరోనా వచ్చిందా అనే ఆందోళనలో ఉన్నారు పార్టీకి హాజరైనవారంతా. కనికా కపూర్ తల్లికి కూడా కరోనా పాజిటివ్ అని తేలడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
కరోనా ఆందోళనలో నేతలు
అయితే, ఎంపీ దుష్యంత్ ఇటీవల రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అక్కడ పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు తదితరులను ఆయన కలిశారు. దీంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ సంఖ్య భారీగా ఉండటంతో అసలు ఎంతమంది ఆయనను కలిశారు అనేది చర్చనీయాంశంగా మారింది. దుష్యంత్ ను కలిసినవారంతా సెల్ఫ్ క్వారంటైన్ లేదా పరీక్షలు నిర్వహించుకున్నారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Recommended Video
పార్లమెంటు సమావేశాలు నిర్వహించొద్దంటూ డెరిక్ ఓబ్రెయిన్..
అటు కనికా కపూర్ పార్టీలోనూ, ఇటూ రాష్ట్రపతి భవన్ లోనూ పాల్గొన్న టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాలను నిర్వహించడం సరికాదని అన్నారు. కాగా, ఇప్పటికే దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరుకుంది. ఐదు కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. ఇందులో నలుగురు భారతీయులు, ఒక విదేశీయుడు ఉన్నారు.