కొండెక్కాయి: భారీగా పెరిగిన కూరగాయల ధరలు, టమాట రూ. 100, రానున్న రోజుల్లో మరింతగా
న్యూఢిల్లీ: ఇప్పటికే పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలతో సతమతమవుతున్న సామాన్య జనాలు భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధానిలో కిలో టమాటో ధర రూ. 60-80 ఉండగా, ఇతర నగరాల్లో రూ. 100కు చేరుకుంది. సప్లై తగ్గడంతోనే ధరలు భారీగా పెరుగుతున్నాయి.

గత వారం కంటే పెరిగిన కూరగాయల ధరలు
గత వారంతో పోలిస్తే ఈ వారంలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. రానున్న రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరగనున్నాయని అమ్మకందారులు చెబుతున్నారు. వర్షాకాలంలో ధరలు ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. టమాట సరఫరా భారీగా తగ్గిపోవడం వల్లే ధరలు పెరిగిపోయాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. టామాట కిలో ధర రూ. 70-80గా ఉంది.

రూ. 100కు చేరిన టమాట, నిమ్మకాయ ధరలూ పైకే
ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన అజాద్పూర్ , ఘాజిపూర్ మండి కూరగాయలు, ప్రూట్ మార్కెట్కు టమాట సరఫరా భారీగా తగ్గిపోయిందని చెప్పారు. రిటైల్ మార్కెట్ లో టమాట కిలో ధర రూ. 65-80గా ఉందని విక్రయదారులు చెబుతున్నారు. మరికొన్ని నగరాల్లో టమాట కిలో ధర రూ. 100 పలుకుతోందని వెల్లడించారు. నిమ్మకాయల ధరలు కూడా పెరిగాయి. కిలో నిమ్మకాయల ధర రూ. 200 నుంచి రూ. 250కి పెరిగిందని తెలిపారు.

రానున్న రోజుల్లో మరింతగా పెరగనున్న కూరగాయల ధరలు
అదేవిధంగా వంకాయ కిలో ధర రూ. 60-80 వరకు ఉండగా, కాలిఫ్లవర్ ధర రూ. 100-120గా ఉంది. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు కిలో ధర రూ. 40గా ఉండగా, క్యాప్సికమ్ రూ. 100-130 వరకు ఉంది. క్యారెట్ కిలో ధర రూ. 80, స్పినాచ్ రూ. 60 కిలో విక్రయిస్తున్నారు. సప్లై తగ్గిపోవడం వల్లనే కూరగాయల ధరలు అమాంతం పెరిగాయన్నారు. వర్షాల కారణంగా పంట దెబ్బతింటుందనే భయంతో రైతులు కొత్తగా పంటలు వేయకపోవడం వల్లే సప్లై తగ్గిందని వివరించారు. రానున్న రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యం లేదని విక్రయదారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications