సంబరాలు ఎలా చేశావ్: కేసీఆర్ను ఏకేసిన వెంకయ్య
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టానికి తెరాసతో సహా పార్లమెంట్లో అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని చెప్పారు. ఆ చట్టం ప్రకారమే గవర్నర్కు హైదరాబాద్లో శాంతిభద్రతల అధికారాలు సంక్రమించాయన్నారు. బిల్లుల్లో ఉన్న అంశాల్నే తాము రాష్ట్ర ప్రభత్వానికి తెలియచేశామన్నారు.
నరేంద్ర మోడీని కేసీఆర్ ఫాసిస్ట్ అనడంపై ఆయన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ఫాసిస్డ్ అనటం సరికాదన్నారు. విభజన బిల్లును పార్లమెంట్ ఆమోదించినప్పుడు సంబరాలు చేసుకున్న కేసీఆర్ ఇప్పుడీలా వ్యాఖ్యానించడం తగదన్నారు. ఫాసిస్టు పదాన్ని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాడతారని కానీ, పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లును అమలు చేస్తుంటే మోడీ ఫాసిస్టు ఎలా అవుతారని ప్రశ్నించారు.
కేసీఆర్ తన వ్యాఖ్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లును స్వాగతించినప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. సమాఖ్య స్ఫూర్తి అంటే కేంద్రం సహకరించడమే కాదని, రాష్ట్రాలు కూడా సహకరించాలన్నారు. రాజకీయ వివాదాలు దేశానికి మంచివి కావని హితవు పలికారు. మోడీపై కేసీఅర్ వ్యాఖ్యలే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పని చేయాలన్నారు. ఫాసిస్టు అనే పదానికి కేసీఆర్ కొత్త అర్థం చెప్పారన్నారు.
ఇరు రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలన్నారు. గవర్నర్సు శాంతిభద్రతల అంశం చట్టంలోనే ఉందన్నారు. కాగా, అంతకుముందు రక్షా బంధన్ అంశంపై మాట్లాడుతూ.. మానవసంబంధాల్లో సోదర, సోదరీమణుల సంబంధం ఉన్నతమైనదన్నారు. దేశ సౌభ్రాతృత్వానికి రక్షా బంధన్ ప్రతీక అన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా మహిళల పట్ల జరగుతోన్న ఆకృత్యాలు, అరాచకాలు తలదించుకునేలా చేస్తున్నాయన్నారు.