బ్యాంకులో హత్య: 11 కేజీల బంగారు లూటీ
చెన్నై: తమిళనాడులోని నాగపట్నం జిల్లా కీళ్ వెన్నిమనిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులో లూటీ చేశారు. బ్యాంకు కార్యదర్శిని అతి దారుణంగా హత్య చేసి రూ. కోట్ల విలువైన బంగారు నగలు, నగదు లూటీ చేశారని పోలీసులు అన్నారు.
పోలీసుల కథనం మేరకు - గురువారం రాత్రి 6.30 గంటల సమయంలో సహకార బ్యాంకు కార్యదర్శి కామరాజ్ (56), క్యాషియర్ గణపతి (45) బ్యాంకులో నగలు, నగదు లెక్కలు చూసుకుంటున్నారు. మిగిలిన సిబ్బంది ఇండ్లకు వెళ్లిపోయారు.
ఆ సందర్బంలో ఎమర్జన్సీ అలారం రిపేర్ చెయ్యాలంటూ ఆరు మంది దుండగులు బ్యాంకులోకి వెళ్లారు. తరువాత బ్యాంకు అధికారులు ఇద్దరి మీద మత్తుమందు స్ప్రే చేశారు. ఇద్దరూ స్పృహ కొల్పోయారు. అయితే కామరాజ్ స్పృహలోకి వచ్చారు.
వెంటనే దుండగులు కామరాజ్ ను నైలాన్ వైరుతో గొంతు బిగించి అతి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని లాక్కోని వెళ్లి లాకర్ లోని కొక్కీకి వేలాడదీశారు. తరువాత గణపతిని ఇష్టం వచ్చినట్లు కొట్టారు.
అతని నోటికి ప్లాస్టిక్ టేపు చుట్టి కుర్చికి కట్టేశారు. తరువాత లాకర్ లోని బంగారు నగలు, నగదు లూటీ చేసి అక్కడి నుంచి వెళ్లి పోయారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
సహకార బ్యాంకులోని లాకర్లలో ఉన్న రూ. మూడు కోట్ల విలువైన 11 కేజీల బంగారు నగలు, నాలుగు లక్షల రూపాయల నగదు లూటీ అయ్యిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గణపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.