Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు - ఇంకొద్ది గంటల్లో తీర్పు - నేరపూరిత కుట్ర తేలేనా? - అసలేం జరిగిందంటే

స్వాతంత్ర్యం తరువాత దేశంలో రాజకీయ గమనాన్ని మార్చేసిన సంఘటన.. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన. దీనికి సంబంధించి రెండు ప్రధాన అంశాల్లో మొదటిదైన భూవివాదంపై గతేడాది సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో హిందూ పక్షానికి కేటాయించింది. అదేసమయంలో.. రెండో ప్రధానాంశమైన 'మసీదు కూల్చివేత' కేసుల విచారణను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఆ గడువును రెండు సార్లు పొడగించగా.. సెప్టెంబర్ 30న లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు తన తీర్పును వెల్లడించనుంది.

తీవ్ర ఉత్కంఠ..

తీవ్ర ఉత్కంఠ..

బుధవారం (సెప్టెంబర్ 30న) బాబ్రీ మసీదు కూల్చివేత కేసులపై తీర్పు వెలువడనుండటం ఉత్కంఠగా మారింది. ఎందుకంటే.. ఈ కేసులో కుట్రపూరిత నేరానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ప్రస్తుత అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నారు. బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, బీజేపీ సీనియర్లు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, సాక్షి మహరాజ్ సహా విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కు చెందిన మొత్తం 32 మంది నిందితుల భవితవ్యం ఇంకొద్ది గంటల్లో తేలిపోనుంది. రెండు మతాలకు సంబంధించి ఇది సున్నితమైన కేసు కావడంతో తీర్పు వెలువడిన తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. ఇక ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే..

మందిర్ వహీ బనాయేంగే..

మందిర్ వహీ బనాయేంగే..

అయోధ్యలో రామజన్మభూమిగా భావించే ప్రదేశంలో ఆలయాన్ని కూల్చేసి మొఘల్ పాలకులు మసీదును నిర్మించారనే ప్రచారాన్ని చేపట్టిన సంఘ్ పరివార్.. ఆలయాన్ని అక్కడే నిర్మిస్తాం(మందిర్ వహీ బనాయేంగే) నినాదంతో ఉద్యమాలు చేపట్టాయి. ఈ క్రమంలోనే 1992లో దేశవ్యాప్తంగా కరసేవకులు అయోధ్యకు తరలివచ్చారు. ఆ ఏడాది డిసెంబర్ 6న లక్షలాది మంది కరసేవకులు బాబ్రీ మసీదు వద్దకు చేరి దాన్ని ధ్వంసం చేశారు. అనంతరం తలెత్తిన మతఘర్షణల్లో 1800 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి దోపిడీ, గాయ పరచడం, ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి ఆరోపణలతో కర సేవకులపై మొదటి ఎఫ్ఐఆర్, విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ బీజేపీ నేత ఎల్కే అద్వానీ, నాటి వీహెచ్ పీ ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘాల్, బజరంగ్ దళ్ నాయకుడు వినయ్ కతియార్, ఉమా భారతి, సాధ్వీ రితంభర, మురళీ మనోహర్ జోషి, గిరిరాజ్ కిశోర్, విష్ణు హరి దాల్మియా తదితరులపై రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. తర్వాతి కాలంలో మరో 47 కేసులు కూడా నమోదయ్యాయి.

మసీదు కూల్చిన 10 రోజులకు..

మసీదు కూల్చిన 10 రోజులకు..

బాబ్రీ మసీదును సంఘ్ శక్తులు కూల్చేసిన 10 రోజుల తర్వాత, అంటే 1992, డిసెంబర్ 16న లిబర్హాన్ కమిషన్‌ ఏర్పాటైంది. ఇది మూడు నెల్లోగా నివేదిక అందించాల్సి ఉండగా, 17 సంవత్సరాల్లో 48 సార్లు గడువును పొడిగించారు. చివరికి 2009 జూన్‌లో లిబర్హాన్ కమిషన్ తుది నివేదికను కేంద్ర హోం శాఖకు సమర్పించింది. అందులో.. అద్వానీ సహా కీలక నేతలందరూ నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేలింది. కూల్చివేత ఘటనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లలో మొదటికేసును సీబీఐ, రెండో కేసును ఉత్తరప్రదేశ్ సీఐడీ విభాగాలు దర్యాప్తు చేశాయి. గందరగోళాన్ని నివారిస్తూ, 1993 ఆగస్టు 27న అన్ని కేసుల్నీ సీబీఐ చేతికి అప్పగించారు. 1993 అక్టోబర్ 5న మొదటి చార్జిషీటు సీబీఐ దాఖలు చేసింది. 1996 జనవరి 10న అనుబంధ చార్జిషీటు వేసింది. అందులో ప్రముఖ రాజకీయ, మత సంస్థల నేతలు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారని, బాబ్రీమసీదు కూల్చివేత పథకం ప్రకారమే జరిగిందని సీబీఐ ఆరోపించింది.

కేసుల విచారణలో హైడ్రామా..

కేసుల విచారణలో హైడ్రామా..

2010 వరకు లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు.. కూల్చివేత కేసులు రెండిటిని వేర్వేరుగా విచారించింది. అలాగే, ఉత్తరప్రదేశ్ లోని పలు కోర్టుల్లో సాగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసుల విచారణలో తరచూ హైడ్రామా జరిగిన సందర్భాలున్నాయి. 1997లో లక్నో మేజిస్ట్రేట్.. 48 మంది కుట్రకు పాల్పడినట్లు తేల్చగా.. వాళ్లలో 34 మంది అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి.. కింది కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. 2001 ఫిబ్రవరి 12న ఇదే అలహాబాద్ హైకోర్టు ఏకంగా అద్వానీ, జోషి, ఉమా భారతి, కల్యాణ్ సింగ్ తదితరులపై అభియోగాలను కొట్టేస్తూ సంచలన తీర్పు చెప్పింది. సదరు తీర్పును సవాలు చేస్తూ సీబీఐ.. సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. రెండు కేసుల్ని కలిపి విచారించాలని 2011లో ఆదేశించింది. ఇక అద్వానీ తదితరులపై అభియోగాలు కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపడుతూ.. సదరు నేతలపై నేరపూరిత కుట్ర కోణంలో విచారణ కొనసాగించాలని 2017 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మొత్తం వ్యవహారంలో హైలైట్ గా నిలిచాయి.

సీబీఐ ప్రతిష్టకు సవాలు..

సీబీఐ ప్రతిష్టకు సవాలు..


దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దాదాపు 40వేల మంది ప్రత్యక్ష సాక్షుల్ని, 100కు పైగా వీడియో, ఆడియో క్యాసెట్లను కోర్టు ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే లిబర్హన్ కమిషన్ సదరు బీజేపీ, సంఘ్ నేతలను కుట్రదారులుగా పేర్కొన్న దరిమిలా దానికి సంబంధించిన ఆధారాలను సీబీఐ సేకరించింది. దర్యాప్తు సంస్థ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. తీర్పు రోజున నిందితులందరూ హాజరు కావాలని జడ్జి ఎస్కే యాదవ్ నోటీసులు జారీ చేశారు. అయితే, తీర్పు చెప్పేది సీబీఐ స్పెషల్ కోర్టు కాబట్టి సహజంగానే ప్రకటన దర్యాప్తు సంస్థకు అనుకూలంగా ఉండొచ్చని, తదుపరి ఈ వివాదం హైకోర్టు లేదా సుప్రీంకోర్టులకు చేరడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఏదిఏమైనా సదరు నేతలు నేరస్తులో కాదో ఇంకాసేపట్లో కోర్టు తేల్చనుంది..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+