అధ్యక్ష పదవా...? వర్కింగ్ ప్రెసిడెంటా...? కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించనున్న కమల్నాథ్...?
కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా... వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ నాయకత్వంలో మార్పు జరగబోతుందా...
జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. రెండేళ్లుగా పార్టీకి అధ్యక్షులే లేరని ప్రత్యర్థులు పదేపదే చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం,కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ గురువారం(జులై 15) ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అధ్యక్షుడి ఎన్నిక ఎప్పుడు...?
కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తర్వాత అధ్యక్ష ఎన్నిక ఉండొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. వయోభారం,ఆరోగ్య సమస్యల రీత్యా సోనియా గాంధీ పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా కొనసాగలేకపోతున్నారు. ఈ ఏడాది జరిగిన తమిళనాడు,పుదుచ్చేరి,బెంగాల్,కేరళ,అసోం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె ప్రచారంలో పాల్గొనలేదు.
ఈ నేపథ్యంలోనే పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎంపిక చేయాలని ఇదివరకే నిర్ణయించారు. అయితే అధ్యక్ష పగ్గాలు ఎవరు చేపడితే పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కమల్నాథ్ పేరు తెర పైకి వచ్చినట్లు తెలుస్తోంది.

కీలక పాత్ర పోషించనున్న కమల్నాథ్...
కమల్నాథ్కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి లేదా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంటా,బయటా ఆయనకు విస్తృత సంబంధాలు ఉండటం... గతంలో పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేయడం... రాహుల్ అత్యంత అభిమానించే నేత కావడంతో... కమల్నాథ్కు పార్టీలో ప్రమోషన్ రావొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలను యూపీఏ కూటమిలోకి తీసుకురావడంలో కమల్నాథ్కు ఉన్న రాజకీయ సంబంధాలు కాంగ్రెస్కు ఉపయోగపడుతాయని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్కు పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించాలని సొంత పార్టీ నేతల నుంచే ఒత్తిడి పెరుగుతుండటంతో కమల్నాథ్కు ఆ అవకాశం దక్కవచ్చునేమో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష పదవి రేసులో ఆయన ముందు వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు.

పీకే చర్చల్లో ఇదే విషయం...
ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోనియా గాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కమల్నాథ్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా సోనియా కొనసాగుతూ వర్కింగ్ ప్రెసిడెంట్గా కమల్నాథ్ను నియమించే విషయమై చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సోనియా మదిలో ఏముందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. కమల్నాథ్ కాంగ్రెస్ తరుపున ఇప్పటివరకూ 9 సార్లు ఎంపీగా గెలిచారు. ఢిల్లీలోనే ఎక్కువగా ఉండే ఆయనకు 2018లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారు. డిసెంబర్ 17,2018 నుంచి మార్చి 20,2020 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయి సీఎం పదవి కోల్పోయారు. కాంగ్రెస్ దిగ్గజ నేత అహ్మద్ పటేల్ మరణం తర్వాత కమల్నాథ్ ఆయన స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications