వ్యాపార దిగ్గజాలు అవాక్కు: పదో తరగతి కుర్రాడికి రూ.5 కోట్ల కాంట్రాక్టు
ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు తన ప్రతిభతో ప్రపంచ వ్యాపార దిగ్గజాలను అవాక్కయ్యేలా చేశాడు. అతనికి ప్రభుత్వం రూ. 5 కోట్ల ప్రాజెక్టు ఇచ్చింది.
అహ్మదాబాద్ : ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు ప్రపంచ దిగ్గజాలు అవాక్కయ్యే ఘనతను సాధించాడు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో గురువారంనాడు అతను తన ఘనతను చాటుకున్నాడు. అతను పద్నాలుగేళ్ళ బాలుడు హర్షవర్ధన్ జాలా. తాను రూపొందించిన డ్రోన్ తయారీ ప్రాజెక్టుకు రూ.5 కోట్ల విలువైన ఒప్పందాన్ని గుజరాత్ ప్రభుత్వంతో కుదుర్చుకున్నాడు.
గుజరాత్ ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖతో ఈ ఒప్పందం కుదిరింది. యుద్ధ రంగంలో మందుపాతరలను గుర్తించి, నిర్వీర్యం చేయగలిగే డ్రోన్లను హర్షవర్థన్ తయారు చేయబోతున్నాడు. పదో తరగతి చదువుతున్న హర్షవర్థన్ మూడు నమూనా డ్రోన్లను తయారు చేశాడు.
మందుపాతరలను అన్వేషించేటపుడు అనేకమంది సైనికులు గాయపడుతున్నట్లు టీవీల్లో చూసి, డ్రోన్ల తయారీకి ప్రేరణ పొందినట్లు హర్షవర్ధన్ తెలిపాడు. 2016లో దీనికోసం కృషి ప్రారంభించానని చెప్పాడు. బిజినెస్ ప్లాన్ను కూడా రూపొందించుకున్నట్లు తెలిపాడు.
మూడు నమూనా డ్రోన్లను తయారు చేసేందుకు సుమారు రూ.5 లక్షలు ఖర్చయిందని తెలిపాడు. రెండు డ్రోన్ల నమూనాల కోసం రూ.2 లక్షలు తన తల్లిదండ్రులు ఇచ్చారని, మూడో నమూనా డ్రోన్ను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు మంజూరు చేసిందన్నాడు.
ఆ డ్రోన్లు ఎలా పనిచేస్తాయో కూడా హర్షవర్ధన్ వివరించాడు. ఎరోబోటిక్స్ కంపెనీతో ఆయన పేటెంట్ నమోదు చేసుకున్నాడు. అతని తండ్రి ప్రద్యుమన్ సిన్హా జాలా నరోడాలోి ఓ ప్లాస్టిక్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. తల్లి నిషాబా జాలా హౌస్ వైఫ్.