మీసం తీసేస్తా!: జయలలితపై విజయకాంత్ సవాల్
గురువారం రిషి వందియం నియోజకవర్గంలో ప్రజలకు సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను బతకడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, కష్టపడి పని చేసి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చానని ఆయన తెలిపారు. బతికేందుకు అనేక మార్గాలు ఉన్నాయన్నారు.
తమిళనాడులో పాలకులు ప్రతిపక్షాల గళం నొక్కేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, ప్రతిపక్షాలను నీచంగా చూశారని, ఇప్పుడు వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో చూడాలని, జయలలిత జైలులో ఉండటాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ధర్మం గెలుస్తుందన్నారు. ప్రజలకు మంచి చేయకుండా, దోచుకోవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చే వారికి శిక్ష తప్పదన్నారు.
తమ అమ్మ జైలులో ఉందని మంత్రులు బాగా ఏడుస్తున్నారని, అలాంటప్పుడు అమ్మ బయటకు వచ్చాకే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఉండొచ్చుగా అని ఎద్దేవా చేశారు. మొసలి కన్నీళ్లు కారుస్తూనే పదవులను కాపాడుకునేందుకు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు.
పాలకుల తప్పులన్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదన్నారు. అయితే, ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎవర్నీ దోచుకోలేదని, ప్రజల ఆస్తులు కబ్జా చేయలేదన్నారు. ఇవన్నీ చేసిన వాళ్లకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు.
ఇది వరకు పాలకులు టీవీలను ఇచ్చారని, ఇప్పుడున్న వాళ్లు కంప్యూటర్లు ఇచ్చారని గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించారు. పోలీసులు మనస్సాక్షిని అనుసరించి పని చేయాలన్నారు. జయలలిత ఏ తప్పు చేయలేదని అన్నాడీఎంకే కార్యకర్తలు, నాయకులు నిరూపిస్తే తాను ఓ పక్క మీసం తీసేసి తిరుగుతానని సవాల్ చేశారు. కాగా, శుక్రవారం జయలలితకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.