ఉవ్వెత్తున ఉద్యమం: జల్లికట్టును తలపించేలా మరో ప్రజా పోరు..
తమిళనాడులోని కావేరీ డెల్టా ప్రాంతంలో ఉన్న నెడువసల్ అనే ఓ మారుమూల పల్లె ఇప్పుడు జల్లికట్టు ఉద్యమాన్ని తలపిస్తోంది.
చెన్నై: తమిళనాడులో అశాంతి రేగుతూనే ఉంది. వరుస సంక్షోభ పరిణామాలతో నిన్నటిదాకా దేశవ్యాప్తంగా చర్చల్లో నానిన తమిళనాడు.. నేడు మరో ప్రజాపోరుతో వార్తల్లోకి ఎక్కింది. వ్యవసాయ భూముల్లో పరిశ్రమల స్థాపనకు సిద్దపడటం పట్ల అక్కడి జనంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
తమిళనాడులోని కావేరీ డెల్టా ప్రాంతంలో ఉన్న నెడువసల్ అనే ఓ మారుమూల పల్లె ఇప్పుడు జల్లికట్టు ఉద్యమాన్ని తలపిస్తోంది. అందరిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తమకోసం నినదించేలా ఆ గ్రామస్తులు పోరుబాట పట్టారు. గ్రామంలో ఏర్పాటు చేస్తున్న హైడ్రోకార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వారు పోరు బాట పట్టారు.
గ్రామస్తులకు అండగా విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు, స్వచ్చంద సంస్థలు, పలువరు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. దీంతో అక్కడి జనంలో జల్లికట్టు ఉద్యమ స్పూర్తి మరోసారి కనిపిస్తోంది.

కాగా, నెడువసల్ గ్రామంలో హైడ్రోకార్బన్ ప్రాజెక్టు కోసం ఓఎన్.జీసీ సంస్థ కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణానికి ఎలాంటి హామి ఉండదని చెప్పడంతో అక్కడి రైతులు, గ్రామస్తులు భూములు లీజుకు ఇచ్చారు.
అయితే ఇటీవల ఆ సంస్థ తవ్విన బావుల వద్ద నల్లటి బురద లాంటి ఆయిల్ పైకి తేలి వస్తోంది. ఇది మెల్లిగా ఆ ప్రాంతమంతా వ్యాపించే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే దీర్ఘకాలంలో ఆరోగ్యం, ఉపాధి పరంగా తీరని నష్టం వాటిల్లుతుందని వారు భావిస్తున్నారు.
ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి సైతం వీరి డిమాండ్ ను పీఎం మోడీకి విన్నవించారు. కాగా, నిరక్షరాస్యులైన తమ కుటుంబ పెద్దల నుంచి గతంలో భూములు లాక్కున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. నిరసనను విరమించాలని పళనిస్వామి కోరుతున్నా.. స్పష్టమైన హామి ఇచ్చేంతవరకు నిరసన నుంచి వెనక్కి తగ్గేది లేదని నెడువసల్ గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications