12 రోజుల్లో ఉరి: బతుకుపై ఆశ చావట్లేదు: రేప్ చేసే సమయానికి చిన్నపిల్లాడినే: సుప్రీంలో పిటీషన్..!
న్యూఢిల్లీ: నిర్భయపై అత్యాచారం కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటోన్న నలుగురు దోషులకూ జీవితంపై ఆశ చావట్లేదు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పటికీ..విఫలమౌతాయని తెలిసినప్పటికీ. తమ ప్రయత్నాలను విరమించుకోవట్లేదు. ఈ నెల 22వ తేదీన ఉరికంబం ఎక్కాల్సిన ఆ నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ కుమార్ శర్మ తాజాగా మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. క్యురేటివ్ పిటీషన్ను దాఖలు చేశాడు.
డెత్ వారెంట్: జనవరి 22.. ఉదయం 7 గంటలకు: తీహార్ జైలులో నిర్భయ కామాంధులకు ఉరి..!
విచారణకు స్వీకరించిన సుప్రీం..
ఈ క్యురేటివ్ పిటీషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. త్వరలో ఇది ధర్మాసనం ముందుకు రానుంది. ఇప్పటికే- ఈ కేసులో నలుగురు దోషులకూ ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం డెత్ వారెంట్ను జారీ చేసిన విషయం తెలిసిందే. వినయ్ కుమార్ శర్మతో పాటు, ముఖేష్ కుమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్లకు ఈ నెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం తీహార్ కేంద్రం కారాగారంలో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వినయ్ కుమార్ శర్మ క్యురేటివ్ పిటీషన్ను దాఖలు చేయడం ఆసక్తి రేపుతోంది.
అప్పటికింకా మైనర్నే..
వినయ్ కుమార్ శర్మ తరఫున ఏపీ సింగ్ ఈ క్యురేటివ్ పిటీషన్ను దాఖలు చేశారు. 2012లో దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై తాను అత్యాచారం చేసే సమయానికి మైనర్నేనని వినయ్ కుమార్ శర్మ ఈ పిటీషన్లో పేర్కొన్నాడు. తనతో పాటు నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన కేసులో మైనర్గా తేలిన మరో యువకుడిని పోలీసులు జువైనల్ హోం తరలించారని, గరిష్ఠంగా మూడేళ్ల పాటు శిక్షను విధించి, విడుదల చేశారని చెప్పాడు. తనతో పాటు అత్యాచారానికి పాల్పడిన యువకుడిని జువైనల్ హోమ్కు తరలించారో.. తనను కూడా మైనర్గా పరిశీలించాలని కోరాడు.