కరోనా ఎఫెక్ట్ : సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఇక వర్చువల్ కోర్టుల ద్వారానే విచారణ..
ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడం గతంలో చూసి ఉంటాం. దిశ ఎన్కౌంటర్ సమయంలో.. నిందితులను ఉంచిన షాద్ నగర్ జైలు బయట ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇకనుంచి కోర్టుల్లో కేసుల విచారణకు వీడియో కాన్ఫరెన్స్ పద్దతిని అనుసరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వచ్చే వారం నుంచి వర్చువల్ కోర్టుల ద్వారానే కేసుల విచారణ చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే అత్యవసర కేసులను తప్ప మిగతావాటిని పక్కనపెట్టిన సుప్రీంకోర్టు.. కరోనా తీవ్రత నేపథ్యంలో వర్చువల్ కోర్టుల నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
అంతా డిజిటల్..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలో మరో నలుగురు న్యాయమూర్తులు,సుప్రీం కోర్టు బార్ లీడర్స్,పలువురు ప్రముఖ వైద్యులతో నిర్వహించిన సమావేశంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా,లలిత్,డీవై చంద్రచూడ్,ఎల్.నాగేశ్వరరావు,ప్రముఖ ఎయిమ్స్ వైద్యుడు రణదీప్ గులేరియా పాల్గొన్నారు. కోర్టులు కరోనా వ్యాప్తి ప్రదేశాలుగా మారకూడదన్న ఉద్దేశంతోనే వర్చువల్ కోర్టుల నిర్ణయం తీసుకున్నట్టు డీవై చంద్రచూడ్ తెలిపారు. వర్చువల్ కోర్టుల ద్వారా డిజిటల్ రూపంలోనే కేసులను ఫైల్ చేయడం,విచారణ జరపడం జరుగుతుందని చెప్పారు. వైరస్ కారణంగా కోర్టులను పూర్తిగా మూసివేయలేం కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీనికి న్యాయవాదులు,పిటిషనర్లు కోర్టులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ప్రొసీడింగ్స్
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై సమీక్ష,ప్రజారోగ్యం రీత్యా వైద్య నిపుణుల సలహాలు,అలాగే న్యాయస్థానాలకు వచ్చే సందర్శకులు,న్యాయవాదులు,కోర్టు సిబ్బంది,సెక్యూరిటీ.. ఇలా అందరి ఆరోగ్య భద్రత గురించి ఆలోచించి వర్చువల్ కోర్టు నిర్ణయాన్ని తీసుకున్నట్టు చంద్రచూడ్ తెలిపారు. న్యాయవాదులు ఆన్లైన్లోనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొసీడింగ్స్ ఫాలో కావాల్సి ఉంటుందని చెప్పారు. డిజిటల్ దరఖాస్తులకు 24గంటలు అవకాశం ఉంటుందన్నారు. జర్నలిస్టుల కోసం ప్రెస్ లాంజ్లో స్మార్ట్ టెలివిజన్లు ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఈ విషయంపై చర్చించేందుకు అన్ని హైకోర్టులతోనూ టచ్లో ఉన్నారన్నారు.
సుప్రీం జాగ్రత్త చర్యలు..
కరోనా విషయమై ఇప్పటికే అపోలో, ఫోర్టిస్ ఆస్పత్రులకు చెందిన వైద్య నిపుణులను సుప్రీంకోర్టు సంప్రదించిందని చంద్రచూడ్ తెలిపారు. ఈ మేరకు వైద్యుల సలహాలు,సూచనలు పాటిస్తున్నామన్నారు.
కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి భారత్కు వచ్చేవారిని ఇక్కడి కోర్టు ప్రాంగణాల్లోకి అనుమతించవద్దని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కోర్టు గదిలోకి ప్రవేశించే మార్గం వద్ద థర్మల్ స్కాన్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా జ్వరం,దగ్గు,జలుబు వంటివాటితో బాధపడేవారిని కోర్టు లోపలికి అనుమతించరన్నారు. అలాగే వ్యక్తికి వ్యక్తికి మధ్య కాస్త గ్యాప్ పాటించాలని.. ఎక్కువమంది గుమిగూడవద్దన్న ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.