‘విస్తారా’ నుంచి బంపర్ ఆఫర్... రూ.849కే విమాన టిక్కెట్
వర్షాకాలం వచ్చిందో లేదో అప్పుడే విమానయాన సంస్థలన్నీ మాన్ సూన్ పేరిట ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో, గో ఎయిర్ సంస్థలు విమాన టిక్కెట్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించగా..
ముంబై: వర్షాకాలం వచ్చిందో లేదో అప్పుడే విమానయాన సంస్థలన్నీ మాన్ సూన్ పేరిట ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో, గో ఎయిర్ సంస్థలు విమాన టిక్కెట్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించగా.. ఇప్పుడు 'విస్తారా' వంతు వచ్చింది.
తాజాగా విమానయాన సంస్థ 'విస్తారా' కూడా వర్షాకాల ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ సంస్థ ఐదు రోజుల పాటు'గ్రేట్ మాన్ సూన్ సేల్' ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా పరిమిత కాల వ్యవధిలో రూ.849 కే ఎకానమీ క్లాస్ టిక్కెట్లు విక్రయిస్తోంది.
జూన్ 13 అర్థరాత్రి నుంచి జూన్ 17 వరకు ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. జూన్ 28 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ప్రయాణాలకు మాత్రమే ఈ టిక్కెట్లు వర్తిస్తాయి. అయితే ప్రీమియం ఎకానమీ సీట్లను మాత్రం రూ.2,099 నుంచి సంస్థ విక్రయిస్తోంది.
గోవా, పోర్టుబ్లెయిర్, లడఖ్, జమ్మూ, శ్రీనగర్, గౌహతి, అమృత్ సర్, భువనేశ్వర్, ఢిల్లీ, కోల్ కతా, ముంబై, బెంగళూరు వంటి దేశీయ మార్గాలను ఈ గ్రేట్ మాన్ సూన్ సేల్ కవర్ చేస్తోంది.
డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, భారత్ లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని విస్తారా పేర్కొంది. ఇక జమ్మూ-శ్రీనర్ మార్గంలో వన్-వే ఎకానమీ క్లాస్ టిక్కెట్లను కూడా ఈ సంస్థ రూ.849కే విక్రయిస్తోంది. airvistara.com, మొబైల్ యాప్స్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.