పార్టీ పుట్టుకే అలా: ఎంజిఆర్ నుంచి ఇప్పటి దాకా...
అన్నాడీఎంకేలో ప్రస్తుత నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ మొదలు ఇటీవలి వరకు పార్టీలో సమస్యలు ఒక్కసారి పరిశీలిద్దాం..
చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాట రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. మాజీ సీఎం జయలలితతోపాటు అక్రమాస్తుల కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత అఖిల భారత అన్నాడీఎంకే (ఎఐఎడిఎంకె) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వికె శశికళా నటరాజన్కు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించడంతో రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాలన్న శశికళ ఆశలకు అడ్డుకట్ట పడింది.
నాలుగేళ్ల జైలుశిక్ష పడటంతో పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె అనర్హురాలు కావడంతో ఆమె రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకమైంది. దీంతో చెన్నై నగరానికి శివారుల్లోని రిసార్టులో ఆమె బలవంతంగా ఎమ్మెల్యేలను నిర్బంధించలేదని మద్రాస్ హైకోర్టులో పోలీసుల నివేదికతో ముందుకు వచ్చిన ఆనందం 24 గంటల్లోపే ఆవిరైంది.
1990వ దశకంలో నాటి సిఎం జయలలితతోపాటు అవినీతికి పాల్పడినట్లు భావిస్తున్న శశికళ పాత్ర ఏమిటన్నది సుప్రీంకోర్టు పేర్కొనలేదు. అన్నాడీఎంకేలో ప్రస్తుత నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ మొదలు ఇటీవలి వరకు పార్టీలో సమస్యలు ఒక్కసారి పరిశీలిద్దాం..

అన్నాడీఎంకే ఆవిర్భావం ఇలా..
తమిళనాట ప్రజాదరణ పొందిన సినీ నటుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజిఆర్).. ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధితో విభేదాలతో బయటకు వచ్చి డీఎంకే నుంచి బయటకు వచ్చి అఖిల భారత అన్నాడీఎంకే (ఎఐఎడిఎంకె) పార్టీని 1972, అక్టోబర్ 17న స్థాపించారు. పార్టీని బలోపేతం చేసేందుకు తన అభిమానులనే కార్యకర్తలుగా మలిచారు. నాటి నుంచి ఇప్పటివరకు డిఎంకె, ఎఐఎడిఎంకే తమిళ రాజకీయాల్లో క్రియశీల పాత్ర పోషిస్తూ వచ్చాయి. పార్టీ స్థాపించిన రెండు నెలల్లోనే దిండిగల్ లోక్ సభా స్థానం నుంచి విజయం సాధించింది. మరో ఏడాది తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎన్నికయ్యారు.

ఎమర్జెన్సీలోనూ కాంగ్రెస్ పార్టీతో చెట్టపట్టాల్
ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీతో ఎఐఎడిఎంకెకు సన్నిహిత సంబంధాలు బలోపేతం అయ్యాయి. 1975 - 1977 మధ్య అత్యవసర పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని అన్నాడీఎంకే సమర్థించింది. అవినీతి ఆరోపణలతో 1976లో నాటి డిఎంకె ప్రభుత్వాన్ని రద్దుచేసిన కేంద్రం.. మరుసటి సంవత్సరం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. నాటి నుంచి 1988లో మరణించే వరకు ఎంజీఆర్ పార్టీ వ్యవస్థాపకుడిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. తొలిసారి 1977 జూన్ 30వ తేదీన రాష్ట్ర ఏడో సీఎంగా ప్రమాణంచేసిన ఎంజిఆర్ 1987లో మరణించే వరకు అదే పదవిలో కొనసాగారు. 1980, 1984 ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే విజయం సాధించింది.

1979లో కాంగ్రెస్ పార్టీకి దూరమైన ఎంజిఆర్
అంతకుముందు 1979లో నాటి ప్రధాని మెరార్జీ దేశాయ్ క్యాబినెట్లో చేరిన తొలి ద్రవిడియన్ పార్టీగా అన్నాడీఎంకే రికార్డు నెలకొల్పింది. దీంతో నాటి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు దెబ్బతిన్నాయి. 1980 జనవరిలో మధ్యంతర పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని 39 స్థానాలకు 37 స్థానాలను గెలుచుకుని రికార్డు నమోదుచేసింది. నాటి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షురాలు ఇందిరాగాంధీ పలు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేశారు. ఈ జాబితాలో తమిళనాడు కూడా ఉన్నది. కానీ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అన్నాడీఎంకే ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

1984లో ఇలా..
1984లో అనారోగ్యం పాలైన ఎంజిఆర్ తిరిగి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మూడోసారి విజయం సాధించారు. దీంతో ఆయన చరిష్మా యథాతథంగా ఉన్నదని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. సినీ నటుడిగా సినిమాల్లో లభించిన మంచి ఇమేజ్నే ప్రజల మనస్సులో ముద్రించుకుపోయింది. 1987 డిసెంబర్ 24న ఆయన మరణించే వరకు ఎంజిఆర్ చరిస్మా అలాగే కొనసాగింది. ఆయన మరణం తర్వాత నటి, ఎంజిఆర్ భార్య జానకీ రామచంద్రన్ పార్టీకి నాయకత్వం వహించేందుకు ముందుకు రావడంతో తొలిసారి ఎఐఎడిఎంకెలో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యేలంతా మద్దతు ప్రకటించడంతో జానకీ రామచంద్రన్ 1988 జనవరి ఏడో తేదీన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

నెల రోజుల్లోనే జానకీ ప్రభుత్వం రద్దు
కేవలం 24 రోజులు మాత్రమే సిఎంగా పనిచేసిన రికార్డును జానకీ నెలకొల్పారు. కానీ 24 రోజులకే రాష్ట్రపతి పాలన విధించడంతో జానకీ పాలన మూణ్ణాళ్ల ముచ్చటగానే నిలిచింది. జయ, జానకీ గ్రూపులు పరస్పరం పోటీ పడి 2, 27 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో 12 ఏళ్ల తర్వాత తిరిగి డీఎంకె అధినేత కరుణానిధి అధికారం చేపట్టారు. కానీ 1991లో కేంద్రంలోని చంద్రశేఖర్ సర్కార్ కరుణ సర్కార్ పై వేటేశారు.

తొలిసారి సీఎంగా జయ ఇలా..
ఆ తర్వాత మళ్లీ జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జయలలిత 1991లో తొలిసారి సీఎం అయ్యారు. రాజీవ్ హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో జరిగిన 234 స్థానాల్లో ఘన విజయంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయలలిత.. తిరిగి 2001లో పార్టీ అధికారంలోకి వచ్చినా అక్రమాస్తుల కేసు కారణంగా సీఎం పదవి చేపట్టలేకపోయారు.

అక్రమాస్తుల కేసుతో ఇలా..
ఫలితంగా తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన ఓ పన్నీర్ సెల్వంను 2001 సెప్టెంబర్ 21న సీఎంగా ఎంపిక చేశారు. ఆమెను సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో తిరిగి 2002 మార్చి రెండో తేదీన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సినీ నటుడు విజయ్ కాంత్ సారథ్యంలోని డీఎండీకేతో పొత్తు పెట్టుకున్న జయలలిత 2011లో 150 స్థానాల్లో విజయం సాధించారు.

రెండోసారి సీఎంగా పన్నీర్..
మళ్లీ ఇదే అక్రమాస్తుల కేసులో 2014 సెప్టెంబర్ 27న ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పడంతో జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇలవరసి, వీఎన్ సుధాకరన్ తదితరుల జైలు పాలయ్యారు. ఈ సారి నాలుగేళ్ల జైలుశిక్ష విధించడంతో జయ ఎమ్మెల్యేగానూ అనర్హత వేటుకు గురయ్యారు. రెండోసారి మళ్లీ పన్నీర్ సెల్వంనే ఆమె సీఎంగా ఎంపికచేశారు. 2014 అక్టోబర్ 17న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం, 2015 మే 11న కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించడంతో తిరిగి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

2015లో ఒంటరిగా విజయ తీరాలకు..
పలు ప్రజాకర్షక పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజలందరికీ దగ్గరైన జయలలిత 2015లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగానే పార్టీని విజయ తీరాలకు చేర్చారు. కానీ ఆమె ఆరోగ్యం దెబ్బ తినడంతో గత ఏడాది సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరారు. సుదీర్ఘ వైద్య చికిత్స తర్వాత కూడా గత డిసెంబర్ ఐదో తేదీన మరణించడంతో సీఎంగా పన్నీర్ సెల్వం ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు.

పార్టీ బాధ్యతలు తలకెత్తుకున్నశశి
పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయ నెచ్చెలి శశికళ బాధ్యతలు చేపట్టారు. అయితే 2011లో బహిష్కరణకు గురి కావడంతో ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా అనుమతించొద్దని రాజ్యసభ సభ్యురాలు పుష్పలత ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దీనికి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో శశికళలో కలవరం మొదలైంది. తొలి నుంచి పార్టీ ఎమ్మెల్యేలపై పట్టు సాధించిన శశికళ తెర వెనుక రాజకీయాల ద్వారా అన్నా డీఎంకే శాసనసభా పక్ష నాయకురాలిగా ఈ నెల ఐదో తేదీన ఎన్నికయ్యారు.

శశికళ భవితవ్యం ఇలా..
సీఎం పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం రెండు రోజుల తర్వాత ఈ నెల ఏడో తేదీన తిరుగుబావుటా ఎగురవేశారు. బలవంతంగా తనతో రాజీనామా చేయించారని ఆరోపించారు. నాటి నుంచి రెండోసారి అన్నాడీఎంకే రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నది. శశికళ కూడా వ్యూహాత్మకంగా ఎమ్మెల్యేలందరితో క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శశికళ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇక మున్ముందు అన్నాడీఎంకే భవితవ్యమేమిటన్నది ఇక మున్ముందు తేలాల్సిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications