ఓటు బ్యాంకు రాజకీయాలు : హిందూత్వ అజెండాగా ప్రచారం, ఓన్ చేసుకుంటున్న కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్
హైదరాబాద్ : ఎన్నికల రావడంతోనే ఓటర్లను ఆకట్టుకొనేందుకు రాజకీయ పార్టీలు తమదైన వ్యుహంతో అడుగులేస్తున్నాయ్. తమ, పర అనే భేదం లేకుండా, లింగ, వయో అనే తేడా చూడకుండా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో బిజీగా ఉన్నాయ్. వయోజనుల నుంచి ఓట్లు రాబట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా ఎక్కడో చిన్న సందేహం .. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హిందూత్వ అజెండాను ప్రచారం చేసి ఓట్లను క్యాష్ చేసుకోవాలని భావిస్తోన్నాయి. హిందూత్వ పేరుతోనే మోదీ అధికారం చేపట్టారా ? రాహుల్ సహా విపక్ష నేతలంతా హిందువుల ఏజెండాగానే ముందుకెళ్లడానికి కారణమిదేనా ? హిందూత్వ ఓటు బ్యాంకు రాజకీయాలపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.
కాంగ్రెస్ తరపున నేను క్షమాపణ కోరుతున్నా: ఆ ఉద్యోగులతో మోడీ
హిందూత్వ ఏజెండా
హిందువునని జీవించు .. హిందువునని గర్వించు, ఇది ప్రముఖ హిందూ సంస్థల నినాదం. కాలక్రమంలో రాజకీయ పార్టీలు కూడా ఈ సామెతను ఓన్ చేసుకొని ఓటుబ్యాంకు రాజకీయాలు చేసి క్యాష్ చేసుకుంటున్నాయి. 2 పార్లమెంట్ సీట్లు నుంచి అధికారం చేపట్టేవరకు బీజేపీ బలోపేతానికి ఇది కూడా ఒక కారణమే ? బీజేపీ సంగతి పక్కనపెడితే ... విపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా క్రమంగా హిందూత్వను ఓన్ చేసుకున్నట్లవుతోంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంకగాంధీ గుడులు, గోపురాల చుట్టూ తిరగడమే.
గుడుల చుట్టూ రాహుల్, ప్రియాంక
రాహుల్ గాంధీ .. కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక రాటుదేలాడు. కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ తానంటే ఏంటో చాటుకున్నాడు. కానీ దాంతో పాటు ఇటీవల ఆయనకు భక్తి కూడా ఎక్కువైంది. సాధారణంగా భక్తితో గుడులు, గోపురాలు సందర్శించి పూజిస్తే ఓకే .. కానీ యువరాజు పర్యటన రాజకీయాలతో ముడిపడటమే హిందూత్వ ఏజెండా అని అనుమానం తలెత్తుతోంది. అంతకుముందు లేని చింతన ... గత రెండేళ్ల నుంచే ఎందుకు వస్తోంది అని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ తర్వాత ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆ పార్టీ నేత, రాహుల్ సోదరి కూడా ఆలయాల బాట పట్టారు. ప్రయాగ్రాజ్ నదీలో ప్రవాహ గ్రామాల్లో ప్రచారం చేస్తూ .. హనుమాను, మాతా ఆలయాలను దర్శించుకొని తన ఊడత భక్తిని చాటుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు కేవలం ఎన్నికల ముందు గుడులకు వెళుతూ తాము హిందువులమని చెప్పడం కాదు .. ఓట్ల కోసం నటిస్తున్నారనే అంశం అర్థమవుతోంది.
నేను కూడా అంటున్న దీదీ
రాహుల్, ప్రియాంకలేనా .. నేను కూడా అంటోంది దీదీ. మోదీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన మమతా బెనర్జీ, ఎన్డీయేర పక్షం ఏర్పాటు కోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. తన మతంపై ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్షా కామెంట్ చేయడంపై దీదీ గుస్సా అయ్యారు. తనతో మంత్రోచ్చరణాలు చదివేందుకు పోటీపడాలని సవాల్ విసిరారు. దేవుడిని ఆరాధించడం అంటే నుదుటిపై తిలకం పెట్టుకోవడం కాదు అని .. మంత్రాల అర్థం ఎంటో తెలుసుకోవాలని‘ ఘాటుగా స్పందించారు. అంతేకాదు తన మతం మానవత్వం అని, ఈ విషయంలో ఇతరుల ప్రసంగాలు అవసరం లేదని మండిపడ్డారు. అంతేకాదు ఎన్నికల వేళ మందిర నిర్మాణం గురించి బీజేపీ రాజకీయాలు చేస్తుందని .. తాము ఇప్పుడే కాదు .. గతంలో కూడా పలు ఆలయాలు నిర్మించానని గుర్తుచేశారు. మీకు రుజువులు కావాలంటే తారకేశ్వర్, దక్షినేశ్వర్ వెళ్లాలని సలహా ఇచ్చారు. అధికార లక్ష్యంగా దీదీ విమర్శలు అయితే ఓకే .. కానీ ఆమె హిందూత్వ అజెండగా విమర్శలు చేయడం ఓటుబ్యాంకు రాజకీయాల కోసమేనని అవగతమవుతోంది.
రేసులో కేసీఆర్
ఫెడరల్ ఫ్రంట్ కోసం విసృతంగా చర్చలు జరుపుతోన్న కేసీఆర్ కూడా .. హిందూత్వ అజెండగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల బహిరంగ సభ వేదికలపై హిందూత్వ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. బీజేపీ నేతలు తాము హిందువులమని, హిందూత్వ అజెండా అంటారని గుర్తుచేశారు. అంటే మిగతావారు గుడిలోకి వెళ్లారా ? దేవుడిని మొక్కరా అని ప్రశ్నించారు. తిరుపతి వెళ్లమా ? ఎములాడ పోమా ? అని గుర్తుచేశారు. పెళ్లి, పెరంటం కోసం పురోహితులతో కలిసి పండుగుల జరుపుకుంటామని .. కానీ కొందరు హిందూత్వను ఓన్ చేసుకోవడం ఏంటని బహిరంగంగా విమర్శిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ అధినేత కూడా హిందూత్వ అంశంతో ముందుకెళుతున్నట్టు అర్థమవుతోంది.
అందరిదీ అదే దారి .. అందుకోసమే తెరపైకి మందిరం
బీజేపీయే కాదు రాహుల్, ప్రియాంక, మమత బెనర్జీ, కేసీఆర్ హిందూత్వ అజెండా తమ రాజకీయ చాణక్యంతో ముందుకెళ్తున్నారు. హిందువులమని చెప్పి ఓట్లు దండుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విపక్షాలన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుండగా .. అధికార బీజేపీ ఒక అడుగు ముందు వేసింది. ఎన్నికల ముందు మళ్లీ తెరపైకి అయోధ్య భూవివాదం తీసుకొచ్చింది. ముగ్గురు నిపుణులతో మధ్యవర్తిత్వం ఏర్పాటుచేసి .. హిందువుల ఓట్లు దండుకొనేందుకు సన్నద్ధమవుతోంది. మరి వివేకం కలిగిన ఓటర్లు ఎవరికి పట్టం కలుగుతారో చూడాలి మరి.