ప్రతీకారం: ముజఫర్నగర్ ఘటనపై మోడీ సన్నిహితుడు
లక్నో: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి సన్నిహితుడైన అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముజఫర్ నగర్ అల్లర్లను ప్రస్తావిస్తూ.. అవమానానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. గుజ్జర్లు, రాజపుత్రులు, దళిత నేతలను ఆయన కలుసుకొని బిజెపికి మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మీకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారా!? ఇందుకు కత్తులు, కటార్లు ఉపయోగించాల్సిన అవసరం లేదని, ఇప్పుడు బిజెపికి ఓటు వేయండి చాలన్నారు. వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నట్లే అని వ్యాఖ్యానించారు. నిద్ర, ఆహారం లేకుండా మనిషి బతకవచ్చునని కానీ, అవమానంతో బతకలేడన్నారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్నారు.

ముజఫర్నగర్ అల్లర్ల కేసులో నిందితుడు, బిజెపి ఎమ్మెల్యే సురేశ్ రాణాతో కలిసి ఇక్కడి గుజ్జర్లు, రాజ్పుట్లు, దళితులు తదితర సామాజిక వర్గాల అమిత్ షా నాయకులను కలిశారు.
గత ఏడాది ముజఫర్నగర్ అల్లర్ల సమయంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయమిది అని, అల్లర్ల సమయంలో మనలను రెండో తరగతి పౌరులుగా చూశారని, మనకు న్యాయం జరగలేదని, అంతమాత్రాన ఇది తుపాకీలు పట్టాల్సిన సమయం కాదని, మొఘలుల కాలంలో ప్రతీకారం తీర్చుకోవడానికి కత్తులు, బాణాలు ఉపయోగించేవారని, ఇప్పుడు వాటి అవసరం లేదని, మీరు సరైన బటన్ ఒక్కటి నొక్కితే చాలన్నారు.
బిజెపికి ఓటు వేస్తే వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నట్లేనని స్పష్టం చేశారు. మన వర్గాన్ని అవమానించిన, మన యువతను చంపిన వాళ్లతో కూర్చుని భోజనం చేయడాన్ని మీరు గౌరవంగా భావిస్తారా? అని ప్రశ్నించారు. అమిత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు మండిపడ్డాయి. కాంగ్రెసు పార్టీ ఈసికి ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications