కమిషనర్పై చేయి చేసుకున్న సిద్ధరామయ్య(వీడియో)
బళ్లారి: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. బళ్లారి పర్యటనకు శనివారం వచ్చిన సీఎం సిద్ధరామయ్య ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు నడిచి వెళుతుండగా అడ్డంగా వచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ రమేష్పై ఆగ్రహంతో చెయ్యి చేసుకున్నారు.
ముఖ్యమంత్రి తోరణగల్లులోని జిందాల్ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం 10.30 గంటలకు వాల్మీకి భవనం ప్రారంభోత్సవానికి రావాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల ఆలస్యంగా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్లు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతుండగా కమిషనర్ రమేష్ అడ్డంగా వెళ్లడంతో కోపంతో ఊగిపోయిన ముఖ్యమంత్రి ఆయనపై చెయ్యి చేసుకున్నారు.
మీడియాలో ఈ విషయం ప్రముఖంగా రావడంతో అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి స్పందించారు. తాను కమిషనర్పై చెయ్యి చేసుకోలేదని, అడ్డంగా రావడం, కమిషనర్ అని తెలియక పక్కకు తోశానని చెప్పారు.
తనపై ముఖ్యమంత్రి చెయ్యి చేసుకోలేదని తర్వాత కమిషనర్ రమేష్ కూడా మీడియా సమావేశంలో చెప్పడం గమనార్హం. కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాలు తొక్కడంతోనే ఆయన కమిషనర్పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.