ఇప్పుడు టీవీల వంతు.. పెరగనున్న రీచార్జీ.. ఎప్పటినుంచి..? ఎంత అంటే
ధరల పెరుగుదలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. పెట్రో వాత, నిత్యావసర ధరల పెరుగుదలతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడు ఆ జాబితాలో కేబుల్ కనెక్షన్ కూడా చేరింది. ఇకపై టీవీ చూడటం ఖరీదైన అంశంగా మారనుంది. ప్రముఖ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్లు జీ, స్టార్, సోనీ, వయాకామ్ 18.. కొన్ని ఛానళ్లను తమ ప్యాక్ నుంచి మినహాయించినందున.. టీవీ ఛానళ్ల ధరలు డిసెంబర్ 1 నుండి పెరగబోతున్నాయి.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త టారిఫ్ ఆర్డర్ కారణంగా బ్రాడ్కాస్టర్లు వారి ధరలను పెంచేశారు. దేశంలో బ్రాడ్కాస్టింగ్, మొబైల్ సేవలను నియంత్రించే అధికారం ఉన్న ట్రాయ్.. 2017 మార్చిలో టీవీ ఛానళ్ల ధరలకు సంబంధించి కొత్త టారిఫ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ కొత్త టారిఫ్ ఆర్డర్తో కొన్ని సమస్యలు ముందుకు వచ్చాయి. దాంతో 2020 జనవరి 1 సవరించిన టారిఫ్ ఆర్డర్ మరోసారి జారీ చేశారు. దీనిని ఎన్టీఓ 2.0 అని పిలిచారు. ఈ ఎన్టీఓ 2.0 లో బొకెట్లోని ఒక్కో ఛానల్ కనీస ధరను రూ.12 గా ట్రాయ్ ఆదేశించింది.
Recommended Video
ఇంతకు ముందు నెలకు రూ.15-25 మధ్య ఉండేది. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ఛానళ్లు తక్కువ ధరలకే బొకెట్లను అందించాయి. కొత్త టారిఫ్ విధానం డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానుండటంతో ప్రముఖ టీవీ ఛానళ్లను వీక్షించే ధర పెరగనుంది. స్టార్ ప్లస్, కలర్స్, జీ టీవీ, సోనీతోపాటు కొన్ని ప్రాంతీయ ఛానళ్లను చూసేందుకు వీక్షకులు 35 నుంచి 50 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. స్టార్, డిస్నీ ఇండియా ఛానళ్లను చూడాలంటే డిసెంబర్ నుంచి ప్రతి నెలా రూ.49 కి బదులుగా రూ.69 ఖర్చు చేయాల్సి ఉంటుంది. సోనీ కోసం నెలకు రూ.39 కి బదులుగా రూ.71, జీ టీవీకి రూ.39 కి బదులుగా రూ.49. వయాకామ్ 18 ఛానల్లకు రూ.25 కి బదులుగా రూ.39 చెల్లించాల్సి వస్తుంది.