సీఎం నివాసం ముట్టడి: రైతులపైకి వాటర్ క్యానాన్లు, టియర్ గ్యాస్, పంజాబ్, హర్యానాలో పంట సేకరణకు ఓకే
న్యూఢిల్లీ/ఛండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి పంట కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని కోరిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలు, సీఎం విన్నపం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట సేకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 10 నుంచి పంట సేకరించాలని కేంద్రం మొదట నిర్ణయించింది. ఆ తర్వాత తాజాగా తన నిర్ణయం మార్చుకుంది.
రైతుల ఆందోళనలు
ఆదివారం(అక్టోబర్ 3) నుంచి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట కొనుగోళ్లు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి అశ్విని చౌబే ప్రకటించారు. అంతకుముందు తడిసిన ధ్యానం కొనుగోళ్లకు ప్రభుత్వం ఒప్పుకోకపొవడంతో రైతులు భారీ ఆందోళనలు చేపట్టారు. అన్నదాతలు హర్యానా సీఎం మనోహర్లాల్ కట్టర్ ఇంటిని ముట్టడించారు. వందలాది మంది రైతులు బారికేడ్లను కూడా నెట్టుకుంటూ చొచ్చుకొచ్చేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిపైకి వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితుల ఏర్పడ్డాయి.

హర్యానాతో పాటు పంజాబ్లోనూ పలువురు బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లను కూడా రైతులు ముట్టడించారు. రైతుల ఆందోళనలతో భారీగా బలగాలను మోహరించారు. బారికేడ్లు ధ్వంసం చేసిన రైతులు ముందుకు దూసుకెళ్లారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. ట్రాక్టర్లతో దూసుకెళ్లడంతో చాలా చోట్ల పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీఛార్జ్ చేశారు. వాటర్ కెనాన్లను కూడా ప్రయోగించారు. అయినప్పటికి రైతులు వెనక్కి తగ్గలేదు. చివరకు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగిరావడంతో హర్యానా రైతులు ఆందోళనలను విరమించారు. కానీ, పంజాబ్ రైతులు మాత్రం ఆందోళనలను కొనసాగిస్తున్నారు.
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత ఏడాది నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, యూపీ సరిహద్దుల్లో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. సాగు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని, రైతులతో చర్చలకు తాము సిద్ధమేనని చెబుతోంది కేంద్రం. పరిస్థితిని సమీక్షించిన హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ రైతులు ఆందోళనలు విరమించాలని కోరారు. రైతుల ఆందోళనపై ప్రధాని మోడీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
కొందరు మేధావులని భ్రమపడే వాళ్లు రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు ప్రధాని మోడీ. కాగా, పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే శనివారం తెలిపారు. ఈ అంశంపై తనను ఢిల్లీలో కలిసిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి ఈ మేరకు సంయుక్తంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications