Wayanad మీ సహాయం కోరుతోంది: సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు ఎలా ఇవ్వాలంటే..!
2018 తర్వాత దేవభూమి కేరళపై ప్రకృతి మరోసారి పగబట్టినట్టుగా కనిపిస్తోంది. అత్యంత సుందరంగా కనిపించే వాయనాడ్ ప్రాంతం ప్రకృతి ప్రకోపానికి బలైంది. అక్కడ కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో గ్రామాలకు గ్రామాలు గల్లంతయ్యాయి. వందలమంది ప్రాణాలు కోల్పోగా చాలామంది అనాథలుగా మిగిలిపోయారు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని దేశం మొత్తం భగవంతున్ని ప్రార్థిస్తోంది. ఈ భారీ వర్షాలకు ముందు పచ్చదనంతో కళకళ లాడిన వాయనాడ్ ప్రాంతం ఇప్పుడు బోసిపోయింది. శవాల దిబ్బగా మారింది. 2024 జూలై 30 మిగిల్చిన విషాదం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఇక వాయనాడ్ ప్రాంతం తిరిగి పూర్వవైభవం సంతరించుకోవాలన్నా... ఆ పచ్చదనం తిరిగి చూడాలన్ని అది ఇప్పుడప్పుడే సాధ్యం అయ్యే పనికాదు. కానీ కాలక్రమంలో ఆ ప్రాంతం మునపటిలా తిరిగి కోలుకుంటుందన్న విశ్వాసం నమ్మకం మాత్రం ఉంది. అయితే ఇందుకు మనవంతు బాధ్యతను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రకృతి ప్రకోపానికి బలైన వాయనాడ్కు తిరిగి ప్రాణం పోయాల్సిన బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరిపై ఉంది. అదే సమయంలో అక్కడ తమవారిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న వారిని మానవత్వంతో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఎంతో మంది చిన్నారులు తమ తల్లిదండ్రులు వస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ ఆ విధ్వంసంకు బలయ్యారన్న విషయం పాపం ఆ చిన్నారులకు తెలియడం లేదు. ఆ చిన్నారులను ఎలా ఓదార్చాలో కూడా అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి వాయనాడ్లో.

ప్రస్తుతం వాయనాడ్ ప్రాంతం సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఒకప్పుడు పర్యాటకులతో కిటకిటలాడిన ఆ సుందరమైన ప్రదేశం ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోయింది. ఎటు చూసినా వరదనీరు, దుర్ఘంధం, అక్కడక్కడ వరదనీటిలో కనిపిస్తున్న మృతదేహాలు. ఇక చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయిన వారి ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. వీరిని ఆదుకునేందుకు అంతా కలిసి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆనాడు 2018లో కేరళపై ప్రకృతి పగబట్టి విధ్వంసం సృష్టించినప్పుడు దేశం యావత్తు ఒక్కటై తిరిగి కేరళను పునర్నిర్మించుకున్నాం. ప్రతి ఒక్కరూ తమకు తోచినంతగా విరాళం ఇవ్వడంతో సాధ్యపడింది. ఇప్పుడు కూడా అందరం మరోసారి కలవాల్సిన పరిస్థితి వచ్చింది. అందరం చేయి చేయి కలిపి మనకు తోచినంతలో వాయనాడ్ను ఆదుకునే ప్రయత్నం చేద్దాం.ఇందుకోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా మనకు సాధ్యమైనంత ఇచ్చి వాయనాడ్కు తిరిగి పూర్వవైభవాన్ని తీసుకొద్దాం.
మీరు విరాళంగా ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి వాయనాడ్ ప్రాంతాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ఉపయోగిస్తారు. అక్కడి జీవనం తిరిగి గాడిలో పడేందుకు వినియోగిస్తారు. రెస్క్యూ, రిలీఫ్, కోసం వాడతారు. మీరు విరాళంగా ఇవ్వాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. అక్కడ ఒక ఫారం కనిపిస్తుంది. మీ వివరాలను అందులో నమోదు చేసి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయండి.నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులను సైతం వినియోగించి విరాళం అందించొచ్చు.అదంతా ముఖ్యమంత్రి సహాయనిధికి చేరుతుంది. అనంతరం ధ్వంసమైన ప్రాంతాల్లో ప్రజల జీవితాలను బాగుచేసేందుకు వినియోగించబడుతుంది. మరిన్ని వివరాల కోసం: https://donation.cmdrf.kerala.gov.in/












Click it and Unblock the Notifications