సుప్రీం తీర్పును అందుకే అంగీకరించాం, మోడీ ఆ మాట ఎందుకు చెప్పరు?: కపిల్ సిబల్
న్యూఢిల్లీ: కర్ణాటక శాసనసభలో నేడు జరగబోయే బలనిరూపణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ జేడీఎస్ లు ఎవరికి వారు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. లోలోపల వారిలోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో సాయంత్రం జరగబోయే పరిణామాలపై కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందించారు. నేటి విశ్వాస పరీక్షలో గెలిచినవాడే 'కింగ్' అని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రొటెం స్పీకర్గా బోపయ్య నియామకాన్ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
విశ్వాస పరీక్ష వాయిదా పడటం ఇష్టం లేకనే సుప్రీం తీర్పును అంగీకరిస్తున్నట్టు కపిల్ సిబల్ తెలిపారు. ప్రొటెం స్పీకరును మార్చాలన్న తమ అభ్యర్థనపై.. అలా అయితే విశ్వాస పరీక్షను వాయిదా వేయాల్సి వస్తుందని సుప్రీం తెలిపింది. విశ్వాస పరీక్ష వాయిదా పడటం మాకు ఇష్టం లేదు. అందుకే సుప్రీం తీర్పుకు అంగీకరించామని కపిల్ సిబల్ అన్నారు.
విశ్వాస పరీక్షను లైవ్ టెలికాస్ట్ చేయాలని సుప్రీం ఆదేశించిందని, దానిపై హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. బలనిరూపణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా పారదర్శకత ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీపై కపిల్ సిబల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'అవినీతి చేయను... చేయించను' అని ప్రధాన మోడీ పదేపదే చెబుతుంటారని, కానీ 'ఎమ్మెల్యేలను కొనను, కొనమని చెప్పను' అని మాత్రం ఆయన ఎన్నడూ చెప్పరని సిబల్ ఎద్దేవా చేశారు.