అసెంబ్లీలో మా వ్యూహం మాకుంది: టీ బిల్లుపై డిగ్గీ
న్యూఢిల్లీ: శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకుంటామని సీమాంధ్ర నేతలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ కీలకమైన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లుపై శాసనసభలో వ్యవహరించే విషయంలో తమ వ్యూహం తమకు ఉందని ఆయన అన్నారు. అసెంబ్లీలో కూడా బిల్లును ఆమోదింపజేసుకునే వ్యూహం తమకు ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అంగీకరించారని చెబుతూ ఇప్పుడు అభ్యంతరమెందుకని ఆయన అడిగారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ఈ రోజు రాత్రి రాష్ట్రపతికి వెళ్తుందని ఆయన చెప్పారు. అసెంబ్లీకి రాష్ట్రపతి ఎంత గడువు ఇవ్వాలనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారని, రాష్ట్రపతి అసెంబ్లీకి ఇచ్చే గడువును బట్టి పార్లమెంటుకు ఎప్పుడు వస్తుందనేది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. అసెంబ్లీ నుంచి బిల్లు పార్లమెంటుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.

శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రతిపాదించడానికి వీలు కాకపోతే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రజల విశ్వాసాన్ని పొందడానికి అవసరమైన అంశాలు బిల్లులో ఉన్నాయని ఆయన చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు చేస్తున్న విమర్శలను స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. అవసరమైతే బిల్లులో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు.
బిల్లులో సాధ్యమైనంతవరకు అన్ని విషయాలను పొందుపరిచామని, బిల్లుపై చర్చ సందర్భంగా సీమాంధ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. బిల్లులో చేరాల్సిన అంశాలు ఉంటే చర్చ సందర్భంగా సీమాంధ్ర నాయకులు చెప్పవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణపై సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెసు నాయకులంతా కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో విజయానికి వ్యూహాలు రచిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications