అపోలో సర్వర్లు హ్యాక్!: లీజియన్ చేతిలో అమ్మ చికిత్స గుట్టు..
లీజియన్ గ్రూప్ నోరు విప్పితే.. అమ్మ చికిత్సకు సంబంధించిన అసలు విషయాలు బయటపడే అవకాశముంది.
చెన్నై: అపోలో ఆసుపత్రి కంప్యూటర్లలో నిక్షిప్తమైన డేటా సర్వర్ల పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించి ప్రముఖ హ్యాకర్స్ గ్రూప్ 'లీజియన్' బాంబు పేల్చింది. ఆ వివరాలు బయటికి వెల్లడిస్తే కల్లోలం తప్పదని, అందులో ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన వివరాలు ఉన్నాయని లీజియన్ పేర్కొనడం గమనార్హం.
సోమవారం నాడు వాషింగ్టన్ పోస్ట్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లీజియన్ గ్రూప్ ఈ విషయాలను పేర్కొంది. కాగా, గతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, లిక్కర్ కింగ్ మాల్యా వంటి వ్యక్తుల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసిన లీజియన్.. తాజాగా ప్రముఖ టీవి జర్నలిస్ట్ బర్ఖాదత్, రవిష్ కుమార్ ల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసింది.
తమ తర్వాతి టార్గెట్ ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ అని లీజియన్ గ్రూప్ ప్రకటించింది. లీజియన్ గ్రూప్ ప్రకటన ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. జయలలిత మరణం నాటకీయ పరిణామాల నడుమ వెల్లడికావడంతో.. లీజియన్ గ్రూప్ నోరు విప్పితే.. అమ్మ చికిత్సకు సంబంధించిన అసలు విషయాలు బయటపడే అవకాశముంది.