అలా చేస్తే బీజేపీకి ప్రచారం చేస్తా: అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర ప్రకటన
న్యూఢిల్లీ: ఏఏపీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్రంపై మాటల యుద్ధానికి దిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర కేంద్ర మంత్రులు ఢిల్లీ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని కేంద్రంపై మండిపడ్డారు.
తాను ఏడాది కాలంగా మౌనంగా ఉన్నానని, ప్రజలు అనుకుంటున్నారని, దీనిని అవకాశంగా తీసుకున్న కేంద్రం తమ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తోందని, తాను సంయమనం పాటిస్తోంది ప్రజల కోసమేనని, దానిని తన చేతగానితనం అనుకోవద్దని, తన ఓపికను తక్కువగా అంచనా వేయద్దని, ఏఏపీ నేతలపై అనవసరంగా 14 అవినీతి కేసులు మోపారని మండిపడ్డారు.
అవి నిజమైన కేసులయితే వాళ్లని శిక్షించవచ్చు కదా అన్నారు. ఇంతవరకు వాటికి సంబంధించి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై అవినీతి కేసు బనాయించారని, మరి ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే వెంటనే శిక్షించవచ్చు అన్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం పోయేలా చేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ విద్యారంగం, ఆరోగ్యరంగంలో చేసిన కృషి ఏమిటో చెప్పాలన్నారు.
ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలా చేస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తామని, లేనిపక్షంలో ఢిల్లీ నుంచి బీజేపీని తరిమేయాలనే నినాదంతో ముందుకు సాగుతామన్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి వద్ద బైఠాయింపు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి ముందు కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం మెరుపు ధర్నా నిర్వహించారు. సుమారు ఆరు గంటల పాటు అర్ధరాత్రి దాటాక కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయ వెయిటింగ్ రూంలో వేచిచూసినా, ఆయన మాట్లాడేందుకు అనుమతించకపోవడంతో అక్కడే సోఫాలో కాళ్లు చాచి నిద్రకు ఉపక్రమించారు. తొలుత కేజ్రీవాల్ తన కేబినెట్తో కలిసి కేంద్రానికి, లెఫ్టినెంట్ గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం ఎదుట ధర్నాపై అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం మాట్లాడుతూ.. తమకు ధర్నా చేయడానికి మించిన ప్రత్యామ్నాయం కనిపించలేదన్నారు. మా డిమాండ్లు పూర్తి చేశాకే ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పాక కూడా స్పందించలేదన్నారు.