‘ఆధార్’పై సుప్రీంకోర్టు సీరియస్, ‘ఆప్షనల్’ అంటే.. ‘తప్పనిసరా’?
ఆధార్ విషయంలో కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మేం ఆప్షనల్ అంటే.. మీరు తప్పనిసరి అని ఎలా ఆదేశిస్తారంటూ మండిపడింది.
న్యూఢిల్లీ: ఆధార్ విషయంలో కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పాన్ కార్డు పొందడానికి ఆధార్ ను ఎలా తప్పనిసరి చేస్తున్నారంటూ ప్రశ్నించింది. తాము ఆప్షనల్ గా చేయాలని ఆదేశిస్తే.. తప్పనిసరి అని ఎలా ఆదేశిస్తారంటూ మండిపడింది.
సుప్రీంకోర్టు మండిపడడానికి కూడా అర్థముంది. కేంద్రం మెల్ల మెల్లగా అన్నిటికీ ఆధార్ కార్డును ముడిపెడుతోంది. సుప్రీంకోర్టు ఆధార్ ను ఆప్షనల్ అని చెప్పినా.. దాన్ని కేంద్రం తప్పనిసరి నిబంధనగా చేరుస్తూ సుప్రీం ఆదేశాలకు తూట్లు పొడుస్తోంది. సామాజిక పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయొద్దంటూ అంతకుమునుపు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
శుక్రవారం దీనిపై అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ ఆధార్ ను తప్పనిసరి చేయడమే ఉన్న ఒకానొక్క ఆప్షన్ అని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. బోగస్ కంపెనీలకు ఫండ్స్ తరలించిన, వాడుతున్న చాలా పాన్ కార్డులను తాము గుర్తించామని చెప్పారు.
ఈ ఫండ్స్ అక్రమ తరలింపును నిరోధించడానికి ఆధార్ ను తప్పనిసరి చేయడమే ఒకానొక్క ఆప్షన్ అని ముకుల్ రోహత్గీ పేర్కొనగా.. అయితే బలవంతంగా ఆధార్ నిబంధన అమలు చేయడం ఒకటే మార్గమా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
గత నెల సవరించిన ఆర్థికబిల్లులో బ్యాంకు ఖాతాలకు, పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్ కు కేంద్రం ఆధార్ నంబర్ ను తప్పనిసరి చేసింది. పాన్ కార్డు పొందడానికి కూడా ఆధార్ ను తప్పనిసరి చేయడంపై దాఖలైన పిటిషన్ పై తదుపరి విచారణ ఏప్రిల్ 25న చేపట్టనున్నట్లు సుప్రీం పేర్కొంది.