'చంద్రబాబు తమిళనాడుకు ఎప్పుడొచ్చిన కచ్చితంగా దాడి చేస్తాం'
చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తమిళ్ మక్కాల్ విదుతలై పులికల్ (టీఎంవీపీ) ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. చంద్రబాబు తమిళనాడుకు వస్తే కచ్చితంగా అతని పైన దాడి చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు తమిళనాడుకు ఎప్పుడు వచ్చినా తాము దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శుక్రవారం నాడు టీఎంవీపీ పార్టీ కార్యకర్త వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా, తాము తెలుగు వారి పైన, వారి సంస్థల పైన కూడా దాడికి వెనుకాడబోమని చెప్పాడు.
శేషాచలం ఎన్కౌంటర్కు నిరసనగా టీఎంవీపీ శుక్రవారం నాడు భారీ రాస్తా రోకో చేపట్టింది. ఈ సందర్భంగా ఓ కార్యకర్త పై వ్యాఖ్యలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు.
శేషాచలం ఎన్కౌంటర్ పక్కా ప్రణాళికతో జరిగిందని ఆరోపించారు. ఘటనకు కారణమైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్కు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. వైకో చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే, అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.