అఖిలేశ్కు చెమటలు పట్టిస్తాం.. ఓటమి భయంతోనే మాపై దాడులు : ఈసీకి బీజేపీ ఫిర్యాదు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్కు చెమటలు పడుతున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. తొలి, రెండో దశ పోలింగ్లో బీజేపీకే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్న విషయం ఆయనకు అర్థమైందన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే వారి పార్టీ కార్యకర్తలు, గూండాలతో హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
బీజేపీ నేతలపై ఎస్పీ గూండాలు దాడి
ఈనెల 14న మెయిన్పురిలో కేంద్ర మంత్రి, కర్హాల్ బీజేపీ అభ్యర్థి ఎస్సీ సింగ్ బఘేల్పై ఎస్పీ గూండాలు దాడి చేశారంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా సమాజ్ వాదీ పార్టీ గూండాలు, రౌడీలు ఇలానే చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ కోరినట్లు ఆయన చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలన్నారు. భారీగా పారామిలటరీ బలగాలను మోహరించాలని .. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

యూపీ ప్రజలను అవమానిస్తారా?
యూపీ ప్రజలను అవమానించే బాధ్యతలను సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ తీసుకున్నట్లు ఉన్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూపీ ప్రజలను గూండాలుగా అభివర్ణించిందని ఆరోపించారు. అలాంటి ఆమెను అఖిలేశ్ యాదవ్ పుష్ఫాలతో రాష్ట్రానికి స్వాగతం పలకడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పంజాబ్ సీఎం యూపీ ప్రజలను అవమానించారు. వారి మాటలకు వత్తాసు పలికేలా ప్రియాంక గాంధీ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ ప్రజల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఠాకూర్ దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications