వచ్చే ఆరు నెలలు మాస్కులు మస్ట్ -లాక్డౌన్ మాత్రం ఉండదన్న సీఎం
కరోనా విలయానికి సంబంధించి దేశంలో మోస్ట్ ఎఫెక్టెడ్ గా కొనసాగుతోన్న మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి కోసం అక్కడి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో వచ్చే ఆరు నెలల పాటు మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. కొవిడ్తోపాటు పలు అంశాలపై రివ్యూ నిర్వహిస్తూ ఆయనీ కామెంట్లు చేశారు.
వైరస్ వ్యాప్తి కట్టడి కోసం రాత్రి పూట కర్ఫ్యూ లేదా లాక్డౌన్లు విధించాలని నిపుణులు చెబుతున్నప్పటికీ ఆ దిశగా తాము ఆలోచనలు చేయడంలేదని సీఎం క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలో ఉన్న కారణంగా తాను లాక్ డౌన్ కు అంగీకరించలేదని ఆయన చెప్పారు.
యూరప్ లో పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళుతుండగా, ఇండియాలోనూ రెండో దశ లాక్ డౌన్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహా సీఎం క్లారిటీతో మన దేశంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ ఉండబోదని మరోసారి స్పష్టంగా తేలింది.
శనివారం మహారాష్ట్రలో 3940 కేసులు నమోదయ్యాయి. 74 మంది చనిపోయారు. కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్రనే తొలి స్థానంలో ఉంది. అక్కడ మొత్తం కేసులు 19లక్షలకు, మరణాలు 49వేలకు చేరువయ్యాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా ప్రభావం చాలా వరకు తగ్గినా.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదని, చికిత్స కంటే నివారణే ఉత్తమమని ఉద్ధవ్ థాక్రే అన్నారు. కనీసం మరో ఆరు నెలల పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.