దొంగల్లా స్క్రార్ఫ్లతో అమ్మాయిలు: జైలుకు పంపిస్తామని హెచ్చరిక
సాత్నా: అమ్మాయిలు దుమ్ముధూళి నుంచి రక్షించుకోవడానికో, మరెందుకో గానీ స్క్వార్ఫ్లు ధరించడం పరిపాటి అయింది. అది ఓ ఫ్యాషన్గా కూడా మారింది. స్క్వార్ఫ్ కట్టుకోవడం వల్ల ముఖాలు కనిపించక వారిని గుర్తించడం కూడా కష్టమవుతోంది. అయితే, మధ్యప్రదేశ్ లోని సత్నాలో స్క్వార్ఫ్ ధరిస్తే జైలుకు పంపిస్తామని ఆంక్షలు విధించారు. అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకుని బయట కనపడితే పోలీసులకు అప్పగిస్తామంటూ సాత్నా మేయర్ మమతా పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతటి ఆగకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లే అమ్మాయిలెవరైనా ముఖంపై ముసుగుతో కనపడితే సత్నా మున్సిపల్ కార్పొరేషన్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె చెప్పారు. "హిందు సంప్రదాయం ప్రకారం మహిళలు తలపై కొంగు, ముస్లిం సంప్రదాయమైతే బురఖా ధరించడం, ఇతర మతాలకు చెందిన స్త్రీలు తమ తల భాగాన్ని ఏదైనా బట్టతో కప్పుకోవడం లాంటివి చేస్తారు" అని ఆమె అన్నారు.

కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించడం లేదని, సంప్రదాయాలను అమ్మాయిలు మరిచి దొంగల తరహాలో ముఖాన్ని ముసుగుతో కప్పి ఉంచుతున్నారంటూ మేయర్ మీడియా సమావేశంలో వివాదాలకు తావిచ్చే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలనే కాకుండా మరీ ముఖ్యంగా తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నానంటూ మీడియాతో చెప్పారు.
ముసుగు ధరించి నేరాలకు పాల్పడే అవకాశాలున్నాయని, ఇటువంటి చర్యలను అరికట్టాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందంటూ చెప్పుకొచ్చారు. మహిళలెవరైనా ఎండ నుంచి ఉపశమనం పొందాలని భావిస్తే అటువంటి వారు గొడుగు వెంట తీసుకెళ్లాలని, లేదంటే చిన్న బట్టతో ముఖాన్ని కప్పేలా చూసుకోవాలని సూచించారు. కానీ మహిళ ఎవరన్నది గుర్తించేలా మాత్రమే ప్రత్యామ్నాయం చూసుకోవాలని, సూర్యాస్తమయం తరువాత ముఖాన్ని కప్పిఉంచరాదంటూ మేయర్ ఆజ్ఞలు జారీచేశారు.కాగా మేయర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications