Weather: హైదరాబాద్లో భారీ వర్షాలు, తెలంగాణలో మూడు రోజులపాటు: ఏపీలోనూ మోస్తరు వానలు
హైదరాబాద్/అమరావతి: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాయి. వేసవి ఎండలు, ఉక్కపోత నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది.

హైదరాబాద్లో వర్షాలు, చల్లబడ్డ నగరం
మరోవైపు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో ఏప్రిల్ 18 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలోనూ మూడురోజులపాటు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల మూడు రోజుల వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. శని, ఆదివారాల్లో ఉరుములు లేదా మెరుపులతో వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. లింగాల మండలంలో భారీ వర్షాలకు పలు గ్రామాలు జలమయమయ్యాయి. లింగాలలో ఇంటిపై ఉన్న రేకుల షెడ్డు గాలివానకు ద్వంసమైంది. బల్మూర్ మండలం తోడేళ్ళగడ్డ గ్రామంలో పిడుగుపాటుకు కాడెద్దు మృతి చెందింది.

మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈరోజు మధ్య చత్తీస్ఘడ్ నుంచి తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావం వలన రాగల మూడు రోజులు తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వర్షం పడే సమయంలో గాలి వేగం గంటకు 30నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తుంటుందని అధికారులు తెలిపారు.

ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు
ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. దీంతో రాగల మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు, రైతుల ఆందోళన
దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో కూడా శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులుతో కూడిన ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలం అహోబిలంలో భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలి వాన బీభత్సంతో భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జేసీబీ సహాయంతో చెట్లను తొలిగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. కాగా, పంట చేతికొచ్చే సమయంలో ఈ వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications